టీడీపీకి మంగళగిరి టెన్షన్.. ప్రత్యేక తాయిలాలు ప్రకటిస్తున్న లోకేష్ !
అమరావతి : మంగళగిరి రాజకీయం హీటెక్కిస్తోంది. ఇక్కడినుంచి ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ బరిలోకి దిగడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికితోడు వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. తాను రేసులో ఉన్నానంటోంది హిజ్రా తమన్నా. లోకేశ్ ప్రధానాస్త్రంగా విమర్శలు చేస్తుంది. దీంతోపాటు లోకేశ్కు ఓటువేయబోమని పద్మశాలీలు తీర్మానం చేయడంతో కలకలం రేగింది.
రంగంలోకి షర్మిల ..
మంగళగిరి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావిస్తోన్న లోకేశ్ .. ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని భీష్మించుకొని కూర్చున్నారు. ఇందుకోసం ఆళ్ల, తమన్నా, పద్మశాలీలు ముప్పేట దాడిచేసేందుకు ఏకమయ్యారు. వీరికితోడు జగన్ సోదరి వైఎస్ షర్మిల .. మంగళగిరి నుంచి ప్రచారం మొదలుపెట్టి లోకేశ్ను ఏరిపారేశారు. రోడ్ షోలో ఎండగట్టడమే గాక .. వెళ్లిపోయే సమయంలో పప్పు బైబై అని చెప్పి సానుభూతి పొందేందుకు ప్రయత్నించింది.
మంగళగిరిలో టీడీపీ జెండా ..?
విపక్షాలన్నీ ఒక్కటవడంతో టీడీపీ కూడా వ్యుహారచన చేస్తోంది. ఎలాగైనా మంగళగిరిలో టీడీపీ జెండా పాతాలని నిర్ణయించుకొంది. ఇక్కడ మెజార్టీ ఓటర్లైనా చేనేత కార్మికులను ఆకట్టుకునేందుకు ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా మంగళగిరి చేనేతకు అంతర్జాతీయ బ్రాండింగ్ తీసుకొస్తామని ప్రకటించారు లోకేశ్. రూ.250 కోట్లతో చేనేత మార్కెటింగ్ నిధి కూడా ఏర్పాటు చేస్తామని భరోసానిచ్చారు. చేనేత కుటుంబాల ఆరోగ్యం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని హామీనిచ్చారు లోకేశ్.
అంతర్జాతీయ టెక్స్టైల్ లెర్నింగ్ సెంటర్ కూడా ..
పైన చెప్పినవే గాక మంగళగిరిలో అంతర్జాతీయ టెక్స్ టైల్ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు లోకేశ్. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నేతన్నల సంక్షేమం కోసం పాటుపడతామని పేర్కొన్నారు. రూ. 2 లక్షల చొప్పున రుణం అందజేస్తామని .. ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు లోకేశ్. నేతన్నల ప్రధాన సమస్యలపై టీడీపీ ఫోకస్ చేసింది. ఎప్పటినుంచే అడుగుతున్న సమస్యలను తీరుస్తామని చినబాబుతో చెప్పించి, ఓట్లు పొందేలా వ్యుహం రచించింది టీడీపీ.
మరి ఓటరు నాడీ ఏమంటోంది ?
అమరావతి రాజధాని పరిధిలోని మంగళగిరి నియోజకవర్గ సీటు హైప్ తీసుకొచ్చింది. మరి ఓటరు నాడీ ఎలా ఉందనే ప్రశ్న తలెత్తుతోంది. గత ఎన్నికల్లో ఆళ్ల .. కేవలం 12 ఓట్లతో బయటపడ్డారు. 2014లో టీడీపీ నుంచి చేనేత సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవి పోటీచేశారు. కానీ ఈసారి కమ్మ సామాజికవర్గానికి చెందిన లోకేశ్ బరిలో నిలువడం, విపక్షాలన్నీ ఒక్కటవడంతో ఏం జరుగుతుందోననే చర్చ మొదలైంది. కానీ మంగళగిరి ఓటుబ్యాంకు చేనేతకు మొగ్గుచూపుతోందని .. కానీ ఈసారి సామాజిక సమీకరణాల ఆధారంగా గట్టి పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.