తట్టుకోలేకపోయారు!: ఏపీలో ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ ప్రేమజంట.. ఏమైంది?
జంగారెడ్డిగూడెం: తమ పెళ్లిని పెద్దలు నిరాకరించారన్న కారణంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. తెలంగాణకు చెందిన ఈ ప్రేమ జంట ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం సమీపంలో ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.
ఆత్మహత్యలపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇద్దరి కులాలు వేరు కావడం, ప్రియుడికి అంతకుముందే పెళ్లయి పిల్లలు కూడా ఉండటంతో పెళ్లికి పెద్దలు అంగీకరించనట్లు తెలుస్తోంది.
ఎవరీ మృతులు?:
ఖమ్మం జిల్లా ఎర్రగడ్డ గ్రామానికి చెందిన గుగ్గిళ్ళ రాంబాబు(28) ఒక వ్యాపార సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఆ వ్యాపార సంస్థ యజమాని చింతల దుర్గారావు కుమార్తె లావణ్య (22)ను రాంబాబు ప్రేమించాడు. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది.
పెళ్లికి నిరాకరణ:
గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పగా.. ఇరువురి కులాలు వేరు కావడం, రాంబాబుకు అంతకుముందే వివాహమై, ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో లావణ్య కుటుంబం పెళ్లికి నిరాకరించినట్లు సమాచారం.
తట్టుకోలేకే:
పోలీసుల కథనం ప్రకారం.. కుటుంబ సభ్యులు తమ పెళ్లిని నిరాకరించడంతో వీరిద్దరు ఇంటి నుంచి బయటకొచ్చేశారు. ఇదే క్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యన్నగూడెం సమీపంలోని కిచ్చప్పగూడెం రోడ్డులో మామాడి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
టిఎస్ 05 ఇజె 6255 నంబర్ గల బైక్ పై వీరిద్దరు ఆ ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం. ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఉండటం తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఇలా ఆత్మహత్య:
మోటార్ సైకిల్ పై నుండి చెట్టు కొమ్మకు చున్నీ, టవల్ వేసి బిగించిన తరువాత, ఒకరి తరువాత మరొకరు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
లావణ్య మృతదేహాన్ని పరిశీలిస్తే.. చున్నీతో ఆమె ఉరి వేసుకున్నట్లు తెలుస్తోంది. టవల్కు ఉరి వేసుకుని రాంబాబు మృత దేహం వేలాడుతోంది. పూర్తి పరిశీలన అనంతరమే పోలీసులు మృత దేహాలను చెట్టుకొమ్మ నుండి వేరు చేసి దించి, పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.