మాన్సాస్ తెరపైకి మగ వారసులు ? వైసీపీ లాస్ట్ ఆప్షన్- అశోక్ని కాదని ముందుకొస్తారా ?
విజయనగరం పూసపాటి రాజవంశీకులకు చెందిన మాన్సాస్ ట్రస్టుపై ఆధిపత్యే కోసం వైసీపీ చేసిన ప్రయత్నాలు తాజాగా హైకోర్టు తీర్పుతో బెడిసికొట్టాయి. ఏడాదికి పైగా మాన్సాస్ ఛైర్పర్సన్గా ఉన్న సంచైత గజపతిరాజును తప్పించి ఆమె స్ధానంలో తిరిగి అశోక్ గజపతిరాజును నియమించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు వైసీపీ పెద్దలకు మింగుడుపడటం లేదు. దీంతో ఈసారి మాన్సాస్ వ్యవహారాలపై పట్టు కోసం మగ వారసుల్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైకోర్టులో అప్పీలు చేసినా సంచైతకు పగ్గాలు దక్కకపోతే వారిలో ఒకరికి పగ్గాలు అప్పగించే అవకాశాలూ లేకపోలేదు.
ఆపరేషన్ మాన్సాస్
మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ నియామకంపై గతంలో ఎన్ని ప్రభుత్వాలు పనిచేసినా ఏ ముఖ్యమంత్రీ జోక్యం చేసుకోలేదు. టీడీపీ నేత అశోక్ గజపతిరాజు ఛైర్మన్గా ఉండగా ఎన్నో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా ఎప్పుడూ అందులో వేలు పెట్టలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం అశోక్ను టార్గెట్ చేస్తూ మొదలుపెట్టిన ఆపరేషన్ మాన్సాస్తో ఆయన అన్న కూతురు సంచైత గజపతిరాజు తెరపైకి వచ్చారు. ఆమె నియామకాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టేయడంతో ఇప్పుడు డివిజన్ బెంచ్లో సవాల్ చేసేందుకు వైసీపీ సర్కార్ సిద్దమవుతోంది.
అదే సమయంలో పూసపాటి వంశీకులకు చెందిన మగ వారసుల్ని తెరపైకి తెచ్చే ప్రయత్నాలూ జరుగుతున్నాయి.
సంచైత పాత్ర ముగిసినట్లేనా ?
మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్గా పూసపాటి వంశానికి చెందిన పురుషులే ఉండాలని అక్కడి నిబంధనలు చెప్తున్నాయి. వీటిని లెక్కచేయకుండా సంచైతను తెరపైకి తెచ్చిన వైసీపీకి ఇప్పుడు హైకోర్టులో ఎదురుదెబ్బ తప్పలేదు. తమ సంస్ధానంలో నిబంధనలు తెలిసీ చూసీచూడనట్లుగా ఆ పదవి చేపట్టిన సంచైత గజపతిరాజుకు సైతం ఇప్పుడు హైకోర్టు తీర్పు మింగుడుపడటం లేదు. ఏదేమైనా మాన్సాస్లో ఆమె పాత్ర ముగిసిపోయినట్లే కనిపిస్తోంది. హైకోర్టు తీర్పును సవాల్ చేసేందుకు ఆమె సిద్ధం కాకపోవడాన్ని చూస్తే మాన్సాస్ నుంచి ఆమె తప్పుకున్నట్లే తెలుస్తోంది.
తెరపైకి మాన్సాస్ మగ వారసులు
మాన్సాస్ నిబంధనల ప్రకారం ట్రస్టు ఛైర్మన్గా ఉండేందుకు పూసపాటి వంశానికి చెందిన మగ వారసులే ఉండాలన్న నిబంధన ఉండటం, హైకోర్టు దాన్నే ప్రస్తావించి సంచైత నియామకాన్ని కొట్టేయడంతో ఇప్పుడు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. అందులో అశోక్ తండ్రి పూసపాటి విజయ గజపతి రాజు రెండో భార్య సంతానం అయిన అలోక్ గజపతిరాజు, మోనిష్ గజపతిరాజు తెరపైకి వస్తున్నారు. వీరు కానీ వీరి సంతానంలో ఒకరైన సిద్ధార్ధ గజపతిరాజు కానీ ఈ పదవి చేపట్టేందుకు ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు. అశోక్ను కాదంటే వీరిలో ఎవరో ఒకరిని వైసీపీ సర్కారు ఎంచుకోవచ్చు.
అశోక్కే మగ వారసుల మద్దతు ?
అశోక్ గజపతిరాజు మాన్సాస్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టకముందు ఆయన అన్న ఆనంద గజపతిరాజు ఛైర్మన్గా ఉండేవారు. ఆయన మరణం తర్వాత అశోక్ బాధ్యతలు చేపట్టారు. అయితే అశోక్ నియామకంపై ఆయన తండ్రి పీవీజీ రాజు రెండో భార్య కుమారులైన అలోక్, మోనిష్ ఎప్పుడూ అభ్యంతరాలు చెప్పలేదు. అశోక్తో పోటీ పడి మాన్సాస్ పదవులు చేపట్టాలని కూడా భావించలేదు. దీంతో వారంతా అశోక్కే అండగా నిలిచినట్లయింది. కానీ సంచైత రాకతో ఆమె తండ్రి రెండో భార్య సంతానమైన ఊర్మిళా గజపతిరాజు వంటి వారు కూడా పగ్గాలు చేపట్టేందుకు తమకూ హక్కుందని వాదించడం మొదలుపెట్టారు. కానీ మగవారసులు మాత్రం ఎప్పుడూ అశోక్తో పోటీపడలేదు.
Recommended Video
వైసీపీ సర్కార్ చివరి ఆప్షన్స్ అవే
వైసీపీ సర్కార్ చేపట్టిన ఆపరేషన్ మాన్సాస్లో ఇప్పుడు ప్రభుత్వం ముందు రెండే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్గా సంచైత నియామకంపై డివిజన్ బెంచ్కు వెళ్లి అప్పీలు చేయడం, లేదా మాన్సాస్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి అక్రమాల పేరుతో మరోసారి అశోక్ గజపతిరాజును తొలగించడం. దీంతో ఈ రెండు మార్గాల చుట్టే వైసీపీ సర్కార్ ఆలోచనలు తిరుగుతున్నాయి. నిన్న మీడియాతో మాట్లాడిన ఎంపీ సాయిరెడ్డి కూడా ఈ రెండు అంశాలపై దృష్టిపెడుతున్నట్లు వెల్లడించారు. అయితే వీటిని మించిన మరో చివరి ఆప్షన్ మగవారసుల్ని తెరపైకి తేవడం, అయితే వీరు అశోక్ను కాదని తెరపైకి వస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారు ముందుకు వస్తానంటే సర్కారు వారికి పగ్గాలు అప్పగించే ప్రయత్నాలు చేయొచ్చు. అలా కాకుంటే మాన్సాస్ అక్రమాల పేరుతో అశోక్ను తొలగించి మగవారసులు లేరని సంచైతకే పగ్గాలు దక్కేలా చేయాలని వైసీపీ భావిస్తోంది.