తాటతీస్తాం... మీసం మెలేసి బాలకృష్ణకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి జయరాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల సమరం కొనసాగుతోంది. అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ భేరి పేరుతో బస్సు యాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి, ప్రతిపక్ష టిడిపిని తీవ్రస్థాయిలో టార్గెట్ చేస్తుంటే, రెండు రోజుల పాటు సాగిన మహానాడులో వైసీపీపై నిప్పులు చెరిగారు టిడిపి నేతలు.
తాజాగా స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పాల్గొన్న హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ సర్కార్ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు.వైసిపి ప్రభుత్వం గుడిని, గుడిలో లింగాన్ని మింగేసే రకం అంటూ బాలకృష్ణ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేశారు. ఒక ఛాన్స్ అంటే ఒక తప్పిదం చేశారని, ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నారని, ప్రజలు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం వచ్చిందని బాలకృష్ణ ప్రజలకు సూచించారు.
ఓటు అంటే నోటు కాదు అని తెలుసుకోవాలని బాలయ్య ప్రజలకు హితవు పలికారు. ఈ సారైనా ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని బాలయ్య సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి రోజురోజుకీ దారుణంగా మారుతుందని మరుగుదొడ్ల పైన కూడా పన్నులు వేసే పరిస్థితి వచ్చిందని బాలకృష్ణ మండిపడ్డారు.
ఇక బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి గుమ్మనూరు జయరాం రివర్స్ కౌంటర్ ఇచ్చారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగుతున్నారని బాలయ్య ఆరోపణలు చేస్తున్నారని ఆయనను వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో ఓడించి తీరుతామని మంత్రి గుమ్మనూరు జయరాం స్పష్టంచేశారు. మీసం మెలేసి చెప్తున్నా, బాలకృష్ణ తాటతీస్తామంటూ మంత్రి గుమ్మనూరు జయరాం వ్యాఖ్యానించారు. బీసీలంతా కలిసి బాలయ్య పని పడతారని పేర్కొన్నారు.
జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావడం ఖాయం అంటూ గుమ్మనూరు జయరాం జోస్యం చెప్పారు. సామాజిక న్యాయభేరి బస్సుయాత్రలకు జనం రావడం లేదని టిడిపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మహిళలతో తిట్టిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. జగన్ గెలిస్తే బీసీలు గెలిచినట్టు అంటూ పేర్కొన్న మంత్రి గుమ్మనూరు జయరాం బాలకృష్ణను ఓడించడం ఖాయమంటూ తేల్చి చెప్పారు.