మేం ఉన్నాం... బాబును కలిస్తే చాలా?: మైసూరా రెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పైన కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ స్థిరాస్తి వ్యాపారులు, సిండికేట్ల చేతిలో కీలుబొమ్మల్లా మారిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మైసూరా రెడ్డి ఆరోపించారు. కమిటీ ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిస్తే చాలా అని ప్రశ్నించారు.
హైదరాబాదులో శివరామకృష్ణన్ కమిటీ పర్యటన అంతా గోప్యంగా ఉందని, అసలు అంత రహస్యంగా వారి కార్యక్రమాలు ఉండాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబును కలిసి ఆయన అభిప్రాయం తీసుకోవడంలో తప్పులేదని అయితే, రాష్ట్రంలో ప్రతిపక్షం, ఇతర రాజకీయ పార్టీలను ఎందుకు విస్మరించారన్నారు.
రాజధాని విషయంలో ప్రభుత్వం ఏం చెబుతోందని, ముఖ్యమంత్రి ఏం చెబుతున్నారనే విషయాలతో పాటు ఇతర పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలన్నారు. కానీ శివరామకృష్ణన్ కమిటీ తూతూమంత్రంగా తతంగం నడిపిస్తోందన్నారు. రాజధాని ప్రాంతం ఎంపిక కోసం పార్లమెంటు సూచించిన షరతులను పట్టించుకోరా అని నిలదీశారు.
అందరి అభిప్రాయాలను తీసుకోకుంటే కమిటీ వారి ఒత్తిళ్లకు లొంగి పని చేస్తున్నట్లుగా భావించవలసి ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికే ఫలానా ప్రాంతంలో రాజధాని ఏర్పాడు అవుతున్నట్లు లీకులు ఇచ్చి వార్తలు రాయిస్తున్నారని ఆరోపించారు.
ఫలితంగా అక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిగ చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని పుత్రజయ, సింగపూర్లలా ఉంటుందని మంత్రులు చెబుతున్నారని, అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు.