పవన్ కల్యాణ్పై నెగ్గిన చంద్రబాబు: మారిన మోడీ, జగన్ కరివేపాకే?
నంద్యాలలో భూమా బ్రహ్మానందరెడ్డిని చంద్రబాబు ఒంటి చేత్తో గెలిపించుకున్నారనే ప్రశంసలు అందుకుంటున్నారు.బిజెపి,పవన్ కల్యాణ్ లేకున్నా నంద్యాలను కైవసం చేసుకోవడంతో తాజా సమీకరణాలు మారుతాయని అంటున్నారు.నంద్య
Recommended Video

హైదరాబాద్: నంద్యాల ఉప ఎన్నికలో తన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒంటి చేత్తో గెలిపించుకున్నారనే ప్రశంసలు అందుకుంటున్నారు. భూమా బ్రహ్మానంద రెడ్డి బొటాబొటీ మెజారిటీతో కాకుండా భారీ మెజారిటీతో విజయం సాధించడం కూడా ఆయనకు కలిసి వచ్చిందని అంటున్నారు.
బిజెపి సహకారం లేకున్నా, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మొండిచేయి చూపినా చంద్రబాబు నంద్యాలను కైవసం చేసుకోవడంతో తాజా సమీకరణాలు కూడా మారుతాయని అంటున్నారు. నంద్యాల ఫలితంతో బిజెపి పెద్దల మనసు మాత్రమే కాకుండా స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ మనసు కూడా మారిందని అంటున్నారు.
ఫలితం వెలువడిన వెంటనే బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పార్టీ కీలక నేత దగ్గుబాటి పురంధేశ్వరి ప్రకటనలు మాత్రమే కాకుండా మోడీ భూమా బ్రహ్మానందరెడ్డిని అభినందిస్తూ చేసిన ట్వీట్ అందుకు నిదర్శనగా చూపుతున్నారు.

ఇలా అనుకున్నారు....
చంద్రబాబుకు బిజెపి దూరమైనట్లేనని, వచ్చే ఎన్నికల్లో జగన్తో బిజెపికి పొత్తు గానీ అవగాహన గానీ ఉండవచ్చునని ప్రచారం సాగుతూ వచ్చింది. పరిణామాలు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చే విధంగానే ఉంటూ వచ్చాయి. అయితే, నంద్యాల ఉప ఎన్నిక ఫలితం బిజెపి పెద్దల మనసు మార్చినట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీని వదులుకోవడానికి సిద్ధంగా లేనట్లు ఆ వారి ప్రకటనలు తెలియజేస్తున్నాయి. అయితే, నంద్యాల ఫలితం తర్వాత ఆ బంధం బలహీనపడినట్లు కనిపిస్తోంది.

చంద్రబాబుకు ఇలా దూరం...
చంద్రబాబును మోడీ విశ్వసించడం లేదని, ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ప్రచారం సాగుతూ వచ్చింది. అందులో నిజం కూడా కొంత ఉంది. అదే సమయంలో మోడీ జగన్తో భేటీ కావడం ఆ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ ఎన్డీఎకు మద్దతు ఇచ్చారు. దీంతో బిజెపితో జగన్ బంధం బలపడిందని అందరూ భావించారు.

వారేమన్నారు...
చంద్రబాబు దోస్తీతో తమకేమీ ఇబ్బందులు లేవని అమిత్ షా అన్నారు. జగన్త పొత్తు గానీ అవగాహన గానీ ఉండదని పురంధేశ్వరి చెప్పారు. ఇక మోడీ ఓ అడుగు ముందుకేశారు. తెలుగుదేశం పార్టీని ఎన్డియేలో విలువవైన పార్టీగా ఆయన అభివర్ణించారు. నంద్యాలలో విజయం సాధించిన భూమా బ్రహ్మానంద రెడ్డిని అభినందిస్తూ మోడీ ఆ వ్యాఖ్య చేశారు. అంటే, చంద్రబాబుతో తెగదెంపులు చేసుకునే విషయంపై బిజెపి పునరాలోచనలో పడినట్లు సంకేతాలు ఇచ్చారు.

జగన్తో అవసరం తీరిపోయిందా...
మోడీకి జగన్తో అవసరం తీరిపోయిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ బేషరతుగా మద్దతు ఇవ్వడం బిజెపికి కలిసి వచ్చిందనేది కాదనలేని విషయం.. ఆ రెండు పదవులకూ తమవారిని గెలిపించుకుంది. ఇక మరో విషయం కూడా ఉంది. ఎపికి ప్రత్యేక హోదా డిమాండుపై జగన్ యువతను కదిలిస్తూ వచ్చారు. అది చంద్రబాబుకే కాకుండా మోడీకి కూడా ఇబ్బందికరంగానే మారింది. తనతో భేటీ తర్వాత జగన్ ఆ డిమాండును దాదాపుగా వదిలేశారు. దాని వల్ల జగన్పై వ్యతిరేక ప్రభావం పడగా, బిజెపి చిక్కుల నుంచి బయటడినట్లయింది. ప్రత్యేక హోదా విషయంంలో జగన్ చంద్రబాబును లక్ష్యం చేసుకున్నప్పటికీ దాని ప్రభావం ఎక్కువగా కేంద్ర ప్రభుత్వంపైనే పడిందనేది కాదనలేని వాస్తవం. ఈ అవసరాలు తీరిన తర్వాత నంద్యాల ఫలితం చూసి బిజెపి జగన్ను దూరం పెట్టే ఆలోచన చేస్తుండవచ్చునని అంటున్నారు.

పవన్ మద్దతు లేకుండానే....
నంద్యాలలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మద్దతు సంపాదించడానికి భూమా కుటుంబ సభ్యులు తీవ్రంగానే ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ మద్దతు తమకే ఉంటుందని మంత్రి భూమా అఖిలప్రియనే కాకుండా ఆమె సోదరి మౌనికా రెడ్డి కూడా చెప్పుకున్నారు. కానీ పవన్ కల్యాణ్ మౌనం వీడి, తాను తటస్థంగా ఉన్నట్లు ప్రకటించారు. అయినా, నంద్యాలలో టిడిపి గెలిపించింది. విజయానికి సంబంధించిన క్రెడిట్ ఎక్కువగా చంద్రబాబుకే దక్కింది. పవన్ కల్యాణ్ మద్దతు లేకున్నా తాము ఒంటరిగా నెగ్గుకురాగలమని ఆయన రుజువు చేశారని అంటున్నారు. ఆ రకంగా పవన్ కల్యాణ్పై కూడా చంద్రబాబు పైచేయి సాధించినట్లు చెబుతున్నారు.

బిజెపి లెక్కలు ఇవీ...
ఒక్క నంద్యాల విజయం బిజెపి ఆలోచనలో అంతగా మార్పు తెస్తుందా అనేది ఆలోచించాల్సిన విషయమే. అయితే, ఆ లెక్కలు మరో విధంగా ఉండే అవకాశం ఉంది. వ్యూహరచనలోనూ దాన్ని అమలులో పెట్టడంలోనూ చంద్రబాబును జగన్ అధిగమించలేకపోయారనేది తేటతెల్లమైందని అంటున్నారు. చంద్రబాబు సమర్థత కన్నా జగన్ బలహీనతలే కొట్టొచ్చినట్లు బయటపడ్డాయని చెబుతున్నారు. సాధారణ ఎన్నికల్లోనూ ఆ విధమైన బలహీనతలే జగన్ ప్రదర్శంచే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అందువల్ల జగన్కు దూరంగా ఉండడమే మంచిదని, చంద్రబాబుతో కొనసాగడమా, లేదా అనే విషయాన్ని ఎన్నికల సమయంలో తేల్చుకోవచ్చునని బిజెపి పెద్దలు ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications