వద్దు: మీడియా వద్ద ఏడ్చేసిన నీతూ అగర్వాల్
కర్నూలు: తన భర్త మస్తాన్వలీ నుంచి ప్రాణహాని ఉందని, తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తాను గతంలో అనలేదని ఎర్రచందనం కేసు నిందితురాలు సినీనటి నీతూ అగర్వాల్ అన్నారు. ఎర్రచందనం కేసులో బెయిల్పై ఉన్న నీతూ అగర్వాల్ ఆదివారం కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్స్టేషన్ సంతకం చేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఎర్రచందనం కేసుతో తమకు సంబంధం లేదన్నారు.
మస్తాన్వలీ గురించి మీడియా వద్ద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. మస్తాన్వలి నుంచి ప్రాణహాని ఉందని, బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తాను ఎక్కడా చెప్పలేదన్నారు. తనకు తీవ్ర జ్వరంగా ఉందని, ప్రస్తుతం డిప్రెషన్లో ఉన్నానని, ఏమి రాయవద్దంటూ కన్నీరు కార్చారు. సిఐ ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ మస్తాన్ కుటుంబసభ్యుల నుంచి గానీ, నాగరాజు నుంచి గానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
బదానియాకు పోలీసు కస్టడీ
ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేష్ బదానియాను ఐదురోజుల పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడంతో కడప జిల్లా బద్వేలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప సెంట్రల్ జైలులో ఉన్న బదానియాను బద్వేలు పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు. ఐదు రోజుల పాటు బదానియాను పోలీసులు విచారించనున్నారు.
బదానియాను విచారిస్తే ఎర్రచందనం స్మగ్లింగ్ వెనుక ఉన్న జిల్లా నేతలు, స్మగ్లర్ల వివరాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. బదానియాను ఈనెల 19న బద్వేలు కోర్టుకు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్కు ఆదేశించిన సంగతి తెలిసిందే. బదానియాను పది రోజుల పాటు తమ కస్టడీ అప్పగించాలని బద్వేలు పోలీసులు కోర్టును ఆశ్రయించారు.
బద్వేలు కోర్టు న్యాయమూర్తి సెలవులో ఉండటంతో శనివారం సిద్దవటం కోర్టు న్యాయమూర్తి ఐదు రోజుల కస్టడీకి అదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బద్వేలు పోలీసులు ఆదివారం ఉదయం సెంట్రల్ జైలు నుంచి బదానియాను కస్టడీలోకి తీసుకొని బద్వేలుకు తరలించి విచారిస్తున్నారు.