ఎన్టీఆర్ భవన్ నుంచి పాదయాత్ర: అమరావతికి తెలంగాణ డిప్యూటీ స్పీకర్
గుంటూరు: అమరావతి రాజధాని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా నాయకులు పాదయాత్రగా వెళ్లాలని నిర్ణయించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు నేతృత్వంలో నాలుగు రోజుల పాటు రాజధాని గ్రామాల మీదగా పాదయాత్ర కొనసాగి 21వ తేదీ ఉదయానికి ఉద్ధండరాయునిపాలెం చేరుకుంటుంది.
శుక్రవారం సాయంత్రం ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావు పాదయాత్ర వివరాలను వెల్లడించారు. ఈ నెల 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ భవన్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. అమరావతి రోడ్డు, గోరంట్ల, లాం మీదగా తాడికొండ, పెదపరిమికి చేరుకొన్న తర్వాత తొలి రోజు ముగుస్తుంది.
19వ తేదీన పరిమి నుంచి నెక్కల్లు, అనంతవరం, వడ్డమాను, హరిశ్చంద్రాపురం మీదగా బోరుపాలెం చేరుకొంటుంది. 20వ తేదీన బోరుపాలెం నుంచి బయలుదేరి దొండపాడు మీదగా తుళ్లూరు చేరుకుంటుంది. 21వ తేదీన తుళ్లూరు నుంచి బయలుదేరి రాయపూడి మీదగా వెలగపూడికి వెళ్లి ఉద్ధండరాయునిపాలెంకు చేరుకొంటుంది. ఈ కార్యక్రమంలో ఇంచార్జీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్బాబు, నారాయణ, ఎమ్మెల్యేలు శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొంటారు.
పాదయాత్రలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణతో పాటు రాజధానికి మట్టి, ఇటుక, నీరు, నిధులు సేకరిస్తామని సుబ్బారావు చెప్పారు. ప్రతిపక్ష నేత జగన్కు మతి భ్రమించడంతో పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తోన్నాడని చెప్పారు. ఆయనకు మానసిక పరిపక్వత లేదని, ఇలాంటి అభివృద్ధి నిరోధక శక్తులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
ఇదిలావుంటే, అమరావతి నగర శంకుస్థాపన కార్యక్రమానికి తాను హాజరవుతానని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి చెప్పారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు ఆమె ఆంధ్రప్రదేశ్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.