రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు రగిలిపోతున్నారు: సి. రామచంద్రయ్య
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనలో అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అసహనం పెరుగుతోందని కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య అన్నారు. అసమానతలపై ఆ ప్రాంత ప్రజలు రగిలిపోతున్నారని ఆయన అన్నారు.
ఇప్పటికైనా చంద్రబాబు తన విధానాలను సమీక్షించుకుని అభివృద్ధి వికేంద్రకరణకు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ప్రత్యేక హోదా డిమాండ్తో మట్టి సత్యాగ్రహంలో భాగంగా ఈ నెల 9, 10 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మట్టిని సేకరించి ప్రధాని నరేంద్ర మోడీకి పంపిస్తామని ఆయన చెప్పారు.
శుక్రవారం విజయవాడలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పిసిసి 17 తీర్మానాలను ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షణమే ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేసింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు.
కాపులను బీసిల్లో చేర్చే విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని సి. రామచంద్రయ్య విమర్శించారు. పుట్టుస్వామి కమిటీ నివేదిక మేరకు కాపులను బీసీల్లో చేర్చవచ్చునని, కానీ కావాలనే చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రతిక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను వ్యతరికేంచి ఇప్పుడు ఎలా అనుమతి ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.