బలవంతంగా తాకాడు, రెండో డైరీలో ఇద్దరు: పేదవాళ్లే లక్ష్యంగా రిషికేశ్వరి
గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరికి చెందిన రెండో డైరీలో ఎన్నో విషయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆమె మొదటి డైరీ పైన దర్యాఫ్తు సాగుతోంది. రెండో డైరీ వరంగల్లోని ఆమె ఇంట్లో లభ్యమైన విషయం తెలిసిందే.
తల్లిదండ్రులు మురళీ కృష్ణ, దుర్గాబాయిలు ఇటీవల దానిని పోలీసులకు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడులకు అందించారు. ఆ డైరీలో అనేక కొత్త విషయాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో అభిషేక్, ఆదిత్య అనే ఇద్దరు విద్యార్థుల పేర్లు తెరపైకి వచ్చాయి.
వరస్ట్ కాలేజీలో చేరానని ఆవేదన
వీరు ఆమెను వేధించారని డైరీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అన్నతో సమానంగా భావించిన వీరు తన పట్ల వేరే ధోరణితో వ్యవహరించారని వరస్ట్ కాలేజీలో అడుగుపెట్టానన్న ఆవేదనను మిగిల్చాయని ఆమె డైరీలో రాసుకున్నట్లుగా సమాచారం.
హాయ్ల్యాండులో జరిగిన స్వాగత వేడుకల్లో వేదిక పైన మిస్ పర్ఫెక్ట్ అవార్డుకు ఎంపికైన రిషికేశ్వరికి ప్రిన్సిపల్ బాబురావు అవార్డు ఇవ్వకుండా దానిని శ్రీనివాస్తో ఇప్పించినట్లుగా అందులో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. సీనియర్ విద్యార్థులతో బాబురావు ఎంతో చనువుగా ఉంటారనేది ఇది తెలియజేస్తోంది.
ఈ వేదిక పైననే శ్రీనివాస్ బలవంతంగా షేక్ హ్యాండ్ ఇవ్వాలని పట్టుబడటం, ఆమె శరీరాన్ని తాకటం వంటివి చేసినట్లు ఈ డైరీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సీనియర్ విద్యార్థి శ్రీనివాస్... రిషికేశ్వరికి ఫోన్ను కూడా లాక్కొని ఇబ్బందులకు గురి చేసినట్లుగా ఆ డైరీలో ఉందని తెలుస్తోంది.
మంచి మిత్రుడిగా భావించిన వ్యక్తే...
తాను మంచి మిత్రుడిగా భావించిన వ్యక్తే తనకు ప్రపోజ్ చేశాడని, ప్రతి వ్యక్తి ఆడపిల్లను అదే భావనతో చూస్తున్నారని, అందరి పైన తనకు అసహ్యం కలుగుతోందని రిషికేశ్వరి రెండో డైరీలో ఉన్నదని సమాచారం.
ఇంటర్లో 88 శాతం మార్కులు తెచ్చుకున్నప్పటికీ ఆర్కిటెక్చర్ కోర్సు తీసుకొని కెరీర్ను తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తున్నానని, నిరుపేదలకు తక్కువ ఖర్చుతే ఇల్లు నిర్మించుకునేలా చేయాలనేది తన లక్ష్యమని ఆర్కిటెక్చర్లో సీటు సాధించేందుకు నాటా ఎంట్రన్స్ రాసేందుకు విజయవాడ, మొగల్రాజపురంలోని ఓ కోచింగ్ సెంటర్లో చేరి నెల రోజుల పాటు కష్టపడి చదివానని ఆమె రాసుకున్నట్లుగా తెలుస్తోంది.
112 ర్యాంక్ రావడంతో జేఎన్ఎఫ్ఏయూలో సీటు వస్తుందని ఆశించినా, ఒక్క ర్యాంకు తేడాతో రాలేదని, నాగార్జునలో సాధించానని, ఎంతో ఆశతో మొదటి రోజు కాలేజీలో అడుగుపెట్టారనని రాసినట్లుగా తెలుస్తోంది.
అనీష మొదట్లో బాగానే ఉండేది
ర్యాగింగ్ ఉంటుందని టెన్షన్ పడ్డానని, వార్డన్ తనకు ధైర్యం చెప్పారని, కానీ మొదటి రోజు రాత్రి సీనియర్స్ తనను పిలిచి సీనియర్స్తో ఎలా వ్యవహరించాలో షరతులు విధించారని, తమ రూంలో 8 మందిమి ఉన్నామని, వారిలో పావని, అనీష, ఉన్నతి, మౌనికలు సీనియర్లను, ముగ్గురు తన క్లాస్ మేట్స్ అని పేర్కొన్నారు.
అనీష మొదట్లో తనతో బాగానే ఉండేదని, ఆ తర్వాత సీనియర్ శ్రీనివాస్తో మాట్లాడాలని చెప్పిందని, ఓ రోజు శ్రీనివాస్తో మాట్లాడాలని తనను ర్యాగింగ్ చేసిందని, ఓసారి లైబ్రరీలో తన పక్కనే కూర్చొని ఫోన్ లాక్కొని తన ఫోటోలు చూశాడని పేర్కొన్నారని తెలుస్తోంది.
నువ్వు చిన్న హీరోయన్లా ఉన్నావని కామెంట్ చేశాడని, చాటింగ్ చేయడం ప్రారంభించాడని, కానీ తనకు అలా చేయడం ఇష్టం ఉండేది కాదని పేర్కొన్నారని సమాచారం. తన ఫోన్లో శ్రీనివాస్ కాంటాక్ట్ నేమ్ మార్చమని అనీష చెప్పిందని, తాను అన్నయ్య అని అతని నెంబర్ సేవ్ చేస్తే... అతడు ఆ విషయం అడిగితే.. అన్నయ్య అని సేవ్ చేశాని చెప్పానని, తనను శ్రీ అని పిలవమని చెప్పడంతో తాను షాకయ్యానని పేర్కొంది.
ఆదిత్య తనకు ప్రపోజ్ చేస్తే నో చెప్పానని, ఆ తర్వాత మరో సీనియర్ చరణ్ వెంట పడ్డాడని, తాను మంచి మిత్రుడిగా భావించిన మనిషి కూడా తనను ప్రేమించాలని ప్రపోజే చేయడం బాధించిందని ఆమె పేర్కొన్నారని సమాచారం.
శ్రీనివాస్ తన గురించి ఎంక్వయిరీ చేస్తుండేవాడని, ప్రతి వ్యక్తి ఆడపిల్లను అదే భావనతో చూస్తున్నాడని, ఛీ వరస్ట్ లైఫ్, నేను బొమ్మలా బతుకుతున్నానని ఆమె పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. చాలా విషయాలు ఎవరితోనే చెప్పుకోలేని పరిస్థితి అని, చివరకు తన తండ్రితో కూడా చెప్పుకోలేకపోయానని ఆమె రాశారని తెలుస్తోంది.