అసెంబ్లీ ఆఫీస్కోసం టీటీడీపీ డిమాండ్, రేవంత్ ఘాటుగా
హైదరాబాద్: శాసనసభ ఆవరణలో తమకు కార్యాలయాన్ని కేటాయించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉపనాయకుడు రేవంత్ రెడ్డిలు శాసనసభ కార్యదర్శి రాజా సదారామ్ను కోరారు. శనివారం శాసనసభ కార్యాలయంలో టీటీడీఎల్పీ నాయకులు ఆయనను కలిసి ఈమేరకు విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే తెలంగాణ టీడీఎల్పీ కార్యాలయం కేటాయించడం ఆలస్యమైందని వెంటనే ఏర్పాట్లు చేయాలని నాయకులు కోరారు. అయితే దీనిపై స్పీకర్ నుంచి తమకు ఆదేశాలు రాలేదని సదారామ్ వారికి వివరించినట్టు తెలిసింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల నాటికి తమకు కార్యాలయం కేటాయించని పక్షంలో ముఖ్యమంత్రి చాంబర్ను స్వాధీనం చేసుకోవాల్సి వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు.
మెదక్ ఉప ఎన్నిక చీఫ్ కంపెయినర్ రేవంత్ రెడ్డి
శనివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెదక్ ఉప ఎన్నిక పైన ఆయన చర్చించారు. ఈ సందర్భంగా మెదక్ లోకసభ ఉప ఎన్నిక చీఫ్ కంపెయినర్గా చంద్రబాబు కొండంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని నియమించారు.