పెద్దలను వదిలేసి...: తాంత్రిక పూజలపై స్వరూపానందేంద్ర
Recommended Video
అనంతపురం: విజయవాడ దుర్గగుడిలో జరిగిన పూజలపై శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూజల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆయన అన్నారు.
హిందూ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ యాత్రలో భాగంగా అనంతపురం వచ్చిన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. కేవలం కొందరి ప్రయోజనం కోసం ప్రజలకు, రాష్ట్రానికి ఏర్పడే నష్టం గురించి తెలుసుకోకుండా ఇష్టమైన రీతిలో పూజలు నిర్వహించడం దారుణమని ఆయన అన్నారు.
అక్కడ అపచారం జరిగితే..
పవిత్రమైన దేవాలయంలో అపచారం జరిగితే దానివల్ల జరిగే అనర్థాలను నివారించేందుకు పీఠాధిపతులతో చర్చించి తగు చర్యలు తీసుకోవాలని స్వరూపానందేంద్ర అభిప్రాయపడ్డారు. లేకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆన హెచ్చరించారు.
అర్చకులను మాత్రమే దోషులను చేస్తారా..
దుర్గ గుడి ఘటనపై పెద్దలను వదిలి అర్చకులను దోషులను చేయడం బాధాకరమని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. పూజలు నిర్వహించిన వారిని వదిలిపెట్టి బ్రాహ్మణులు, అర్చకులను భయభ్రాంతులకు గురిచేయడం సరైంది కాదని ఆయన అన్నారు.
బ్రాహ్మణుల పరిస్థితి దారుణంగా...
బ్రాహ్మణుల పరిస్థితి దారుణంగా తయారైందని స్వరూపానందేంద్ర అన్నారు. వారి స్థలాలను అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు లాగేసుకుంటున్నారని ఆరోపించారు. తాంత్రిక పూజల మలినాన్ని కడిగి సంప్రోక్షణ చేయాలని ఆయన సూచించారు.
వారిపై చర్యలు తీసుకున్నామని..
దుర్గగుడిలో నిబంధనలకు విరుద్ధంగా పూజలు చేయించిన వారిపై ఇప్పటికే శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. తప్పులు చేస్తే ఎంతటి వారినైనా సహించబోమని ఆయన అన్నారు. పోలీసుల నుంచి సమగ్ర నివేదిక అందిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన, పూజలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అవి చాలా సున్నితమైన అంశాలు..
గుడి, మసీదు, చర్చి సున్నితమైన అంశాలని, రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకూడదని చంద్రబాబు అన్నారు. కొందరు కులాలు, మతాలు, వర్గాలను రెచ్చగొట్టి కలహాలను సృష్టించాలని చూస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.