ఆర్టీసి కార్మికులతో చర్చలు విఫలం: మధ్యలోనే వెళ్లిపోయిన ఎండి
హైదరాబాద్: ఆర్టీసి యాజమాన్యంతో కార్మిక సంఘాలు శుక్రవారం జరిపిన చర్యలు విఫలమయ్యాయి. హైదరాబాద్ బస్ భవన్లో ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ సాంబశివరావుతో జరిపిన ఈ చర్చల్లో ఈయూ, టిఎంయూ నాయకులు పాల్గొన్నారు. చర్చలు జరుగుతుండగా మధ్యలోనే ఎండి వెళ్లిపోయారు.
ఎండీపై కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. కార్మిక సంఘాల సమ్మెను అణచివేసే విధంగా ఎండి వ్యవహరిస్తున్నారని వారన్నారు. చర్చల సందర్భంగా ఎండికీ, నాయకులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. చర్చలు విఫలమైన తర్వాత కార్మిక సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు.
ఎండి సాంబశివ రావు నియంతృత్వ ధోరణి వీడితేనే చర్చలు సఫలమవుతాయని వారన్నారు. ఎండి హోదాకు తగినట్లుగా వ్యవహరించడం లేదని వారు తప్పు పట్టారు. ఎండి వ్యవహారంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. చిత్తూరులో కార్మికులపై పోలీసుల లాఠీచార్జీని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు చెప్పారు. సమ్మె సందర్బంగా కార్మికులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు.
ఎండీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని యూనియన్ నేత అశ్వత్థామరెడ్డి అన్నారు. కాంట్రాక్టు కార్మికులను తొలగించే దమ్ము ఎండీకి ఉందా అని ఆయన ప్రశ్నించారు. మరో నేత పద్మాకర్ ఆర్టీసీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చేవరకు సమ్మె ఆగదని, రేపు అన్ని డిపోల్లో వంటా వార్పు నిర్వహిస్తామని పద్మాకర్ ప్రకటించారు. చర్చలు సుహృద్బావ వాతావరణంలో జరగాలని ఆయన అన్నారు.
కీలక సమయంలో ఆర్టీసీ సమ్మెతో ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 27 శాతం ఫిట్మెంట్కు కార్మికులు అంగీకరించడం లేదని ఆయన అన్నారు.కార్మికుల డిమాండ్ కాదనడం లేదు. అయితే, కార్మికులు సంస్థ ఆర్థిక పరిస్థితి దృష్టిలో ఉంచుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు.