షిండేను అడ్డుకున్న టిడిపి ఎంపీలు, నెట్టేసిన పోలీసులు
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు శనివారం అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. సీమాంధ్రకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన పైన మంత్రుల బృందం(జివోఎం) సాయంత్రం నాలుగు గంటలకు రెండోసారి భేటీ అయింది. ఈ సమయంలో భేటీ జరుగుతున్న గేటు ముందు ఎంపీలు బైఠాయించారు.
షిండే వెళ్తుండగా ఆయనను ఎంపీలు నిలదీశారు. సీమాంధ్రకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ న్యాయం చేశాకే జివోఎం బేటీ జరపాలని డిమాండ్ చేశారు. ఈ దశలో షిండే అందరికీ న్యాయం చేస్తామని చెప్పి లోపలకు వెళ్లారు. అయితే షిండే నుండి సానుకూల స్పందన రాకపోవడంతో ఎంపీలు లోపలకు చొచ్చుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది టిడిపి ఎంపీలను నెట్టేశారు. దీనిపై ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమావేశం మందిరం గేటు వద్దనే ఉండి ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపి శివ ప్రసాద్ స్వర్గీయ నందమూరి తారక రామారావు తరహాలో మాట్లాడి నిరసన తెలిపారు.
అనంతపురం తెలియని ఆంటోనీ, గుంటూరు తెలియని గులాం నబీ ఆజాద్, మొగల్తూరు తెలియని మొయిలీ, చిత్తూరు తెలియని చిదంబరం, సీమాంధ్ర తెలియని షిండే, నారాయణఖేడ్ తెలియని నారాయణ స్వామిలు ఆంధ్రప్రదేశ్కు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
వారు ఎసి రూముల్లో భేటీలు మాని ప్రజల మధ్యకు రావాలని డిమాండ్ చేశారు. లోపభూయిష్ట విభజనకు తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు. వారు సమావేశ మందిరంలోకి వెళ్లే ప్రయత్నాలు చేసినా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. జివోఎం రాష్ట్రంలో పర్యటించాలని ప్లకార్డులు ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications