టీడీపీకి గవర్నర్ షాక్: ఫిరాయింపుదారుల్లో కలవరం.. మంత్రి పదవులకు ఎసరు?
ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయని పక్షంలో వారిచేత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించేది లేదని గవర్నర్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: గతంలో తనపై వచ్చిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఇకనుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే.. వారి చేత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించాలని గవర్నర్ నరసింహన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
గవర్నర్ నిర్ణయంతో త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని భావిస్తున్న టీడీపీకి షాక్ తగిలినట్లయింది. వైసీపీ నుంచి కొత్తగా టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేల్లో పలువురికి మంత్రి పదవులు ఇవ్వాలని టీడీపీ భావిస్తున్న తరుణంలో గవర్నర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వారిని కలవరపరుస్తోంది.
మరోవైపు ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే.. వారి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తానని, ఆ తర్వాత ఆరు నెలల్లోగా ఏదో రూపంలో వారు ఎన్నికల్లో గెలవాల్సి ఉంటుందని టీడీపీకి చెందిన ఓ నేతతో గవర్నర్ వివరించినట్లు సమాచారం.
ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయని పక్షంలో వారిచేత మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించేది లేదని గవర్నర్ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఫిరాయింపుదారుల్లో తీవ్ర కలవరం మొదలైంది. పదవుల మీద ఆశతో పార్టీలు మారితే గవర్నర్ కొత్త చిక్కు తెచ్చిపెడుతున్నారని అంతర్గతంగా వారు వాపోతున్నట్లు చెబుతున్నారు.
పదవులు దక్కని పక్షంలో టీడీపీలో చేరి వారి లాభపడింది ఏమి ఉండదు కాబట్టి.. అలాంటి నేతలు యూ టర్న్ తీసుకునే ఆలోచన చేస్తే అది టీడీపీకి నష్టం చేకూర్చేదవుతుంది. కాగా, గతంలో తెలంగాణకు సంబంధించి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి.
పదవులకు రాజీనామా చేయించకుండా ఫిరాయింపుదారులతో ప్రమాణస్వీకారాలు చేయించడం పట్ల గవర్నర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇకనుంచి అలాంటి విమర్శలకు మళ్లీ స్థానం కల్పించవద్దనే ఉద్దేశంతో గవర్నర్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.