బయటకు రా!: సోనియా ఇంటికెళ్లి టిడిపి నేతల సవాల్
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించి సవాళ్లు చేశారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు దీక్షను భగ్నం చేయడంతో నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వ్యూహాత్మకంగా 10 జనపథ్ చేరుకొని నిరసన తెలిపారు. తెలుగుదేశం ఆందోళన 10 జన్పథ్ను హోరెత్తింది. సోనియా డౌన్ డౌన్.. సోనియా గో బ్యాక్.. నినాదాలతో కాంగ్రెస్ అధినేత్రి నివాసం దద్దరిల్లిపోయింది.
సీమాంద్రులకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని నిలదీసింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చి తమకు సమాధానం చెప్పాలని లేకపోతే తామే లోపలికి వస్తామని టిడిపి సవాల్ విసిరింది. ఇంటిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. భారీగా తరలివచ్చిన టిడిపి శ్రేణులు తమను లోనికి పంపాలని, లేదంటే సోనియానే బయటకు రావాలంటూ డిమాండ్ చేశారు. దాదాపు గంటసేపు నినాదాలతో హోరెత్తించారు. సోనియా నివాసాన్ని దిగ్బంధించి పచ్చ జెండాలను రెపరెపలాడించారు.
వీ వాంట్ జస్టిస్, సోనియా డౌన్ డౌన్, సోనియా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎంపీలు కొనకళ్ల నారాయణ, సిఎం రమేశ్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, శివ ప్రసాద్, ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, దేవినేని ఉమామహేశ్వర రావు, జయమంగళ వెంకట రమణ, ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్, నాయకులు కంభంపాటి రామ్మోహన్ రావు, కరణం బలరాం, రామ్మోహన్ నాయుడు, చింతకాయల విజయ్ల ఆధ్వర్యంలో వందలమంది కార్యకర్తలు తొలుత జంతర్మంతర్ వద్ద ధర్నా చేశారు.
తర్వాత వేర్వేరు వాహనాల్లో సోనియా నివాసం వద్దకు చేరుకున్నారు. ర్యాలీగా వెళ్తే పోలీసులు అడ్డుకుంటారని వ్యూహాత్మకంగా వాహనాల్లో వేర్వేరుగా అక్కడకు చేరుకున్నారు. సోనియా నివాసం వద్దకు వాహనాలు చేరుకోగానే ఒక్కసారిగా వాటిల్లో నుంచి బయటకు దూకిన నాయకులు, కార్యకర్తలు సోనియా నివాసాన్ని చుట్టుముట్టారు. ముందస్తు సమాచారం లేకపోవటంతో సోనియా నివాసం వద్ద పెద్దగా పోలీసు బందోబస్తు లేదు. సాధారణంగా ఉండే సిబ్బంది మాత్రం గేట్లు మూసేసి టిడిపి శ్రేణులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
టిడిపి ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రం ఒక గేటును దాటి లోనికి వెళ్లారు. ఈలోపు పోలీసులు దూసుకొచ్చి బ్యారికేడ్లు అడ్డంగా పెట్టారు. కానీ, నాయకులంతా ఆ బ్యారికేడ్లు ఎక్కి టిడిపి జెండాలు పట్టుకుని లోనికి దూకేందుకు ప్రయత్నించారు. తాము లోనికి వెళతామని, లేదంటే సోనియా బయటకు రావాలని ఎంపీలు పట్టుబట్టారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకుని రోడ్డుపైకి పంపే ప్రయత్నం చేశారు. దీంతో టిడిపి నాయకులంతా గేటు వద్దే పడుకుని నిరసన తెలిపారు. గంట తర్వాత పరిస్థితి కొద్దిగా అదుపులోకి రావటంతో పోలీసులు టిడిపి నాయకులు, కార్యకర్తలను వాహనాల్లో తిలక్మార్గ్ పోలీసు స్టేషన్కు తరలించారు.