ఎపిలో మళ్లీ పిడుగులు పడే అవకాశం:ఈ ప్రాంతాల్లో పడొచ్చు...బి అలెర్ట్!...అంటున్న వాతావరణ శాఖ
విశాఖ:ఎపిలో మళ్లీ భారీ సంఖ్యలో పిడుగులు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. కొద్ది నెలల క్రిందటే పలు జిల్లాల్లో వేల కొద్ది పిడుగులు పడగా...మళ్లీ మరోసారి పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించడం గమనార్హం.
తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉందని...అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం, అడ్డతీగల, తాళ్లరేవు, ముమ్మడివరం, కృష్ణా జిల్లా విజయవాడ అర్బన్, రూరల్, బాపులపాడు, నూజివీడు, ఆగిరిపల్లి, జి.కొండూరులో కూడా పిడుగులు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
వీటితో పాటు గుంటూరు అర్బన్, పెదకాకాని, మేడికొండూరు, నెల్లూరు జిల్లా వెంకటగిరి, బాలాయపల్లి, చిత్తూరు జిల్లా తొట్టంబేడు, కార్వేటినగర్, వెదురుకుప్పం, పెనుమూరులో పిడుగులు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ ఏడాది మే నెల 1 వ తేదీన అంతకుముందెన్నడూ లేనివిధంగా ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 40 వేలకు పైగా పిడుగులు పడ్డాయి. పిడుగులు పడతాయని ముందస్తుగా హెచ్చరికలు జారీచేసినా...రాష్ట్రంలో 14 మంది మరణించారు. పిడుగుపాటుతో ప్రాణనష్టం సంభవించకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల్లో అవగాహన లేమి కారణంగా ప్రాణనష్టం సంభవిస్తూనే ఉంది.
సాధారణంగా పిడుగుపాటును 40 నిమిషాల ముందే పసిగట్టి విపత్తు నిర్వహణ సంస్థ సంబంధిత ఎంఆర్ఓకు సమాచారం అందిస్తుంది. ఎంఆర్ఓ నుంచి సమాచారం వీఆర్ఓకు వెళ్తుంది. వీఆర్ఓ తన పరిధిలోని గ్రామాల్లో తక్షణం హెచ్చరికలు జారీచేసి, ప్రజలను పిడుగుపాటు నుంచి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తారు. కానీ పగటిపూట ఏదో ఒక వ్యవసాయ పనుల్లో భాగంగా పొలాల్లో ఉన్న రైతులు, రైతు కూలీలకు సమాచారం చేరకపోవడం, తెలిసినా పెద్దగా పట్టించుకోకపోవడంతోనే ప్రాణనష్టం ఎక్కువ ఉంటోందని, అందుకే పిడుగు పాటు హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవలి కాలంలో జనావాసాల్లో పిడుగులు పడే ప్రమాదముంటే 40 నిమిషాలు ముందే బీఎస్ఎన్ఎల్ సెల్ఫోన్లో మెసేజ్ వచ్చేలా ఏర్పాటు చేశారు. ఎంఆర్ఓ, వీఆర్ఓల వాట్సాప్ గ్రూపులు, బీఎస్ఎన్ఎల్ బల్క్ ఎస్ఎంఎస్ల ద్వారా ప్రమాద హెచ్చరికలను అత్యంత వేగంగా (రియల్ టైంలో) అధికారులు జారీచేస్తున్నారు. ప్రస్తుతం కేవలం బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ద్వారా మాత్రమే పిడుగుపై సమాచారం ఇచ్చే అవకాశం ఉంది.