కాకినాడ ఎంపి డెబిట్ కార్డు క్లోనింగ్: గోవాలో రూ. 50వేల డ్రా, సిఐడికి ఫిర్యాదు
తూర్పుగోదావరి: కాకినాడ ఎంపి తోట నర్సింహం డెబిట్ కార్డ్ క్లోనింగ్కు గురైంది. తోట నర్సింహంకు చెందిన డెబిట్ కార్డును క్లోనింగ్ చేసిన ఆగంతకులు, ఆయన ఖాతా రూ. 50వేలు డ్రా చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో తన కార్డు క్లోనింగ్ జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులకు తోట నర్సింహం ఫిర్యాదు చేశారు. దీంతో మోసానికి పాల్పడిన సైబర్ నేరగాళ్ల కోసం సిఐడి గాలింపు చేపట్టింది. నిందితులు గోవాలోని ఓ ఏటిఎం నుంచి రూ. 50వేలు డ్రా చేసుకున్నట్లు తేలింది.
కాగా, 15రోజుల క్రితం తన ఖాతా నుంచి రూ. 50వేలు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చిందని సిఐడికి ఇచ్చినట్లు ఫిర్యాదులో ఎంపి తోట నర్సింహం తెలిపారు. తాను ఇటీవల బెంగళూరులోని ఓ షాపింగ్ మాల్లో షాపింగ్ చేసిన సమయంలో తన డెబిట్ కార్డు క్లోనింగ్ జరిగి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తాను షాపింగ్ చేసిన రెండు మూడు రోజులకే రూ. 50వేలు డబ్బు డ్రా చేసినట్లు తనకు మెసేజ్ వచ్చిందని నర్సింహం తెలిపారు. నిందితులు డ్రా చేసిన సమయంలో తన ఖాతాలో రూ. 13లక్షలకు పైగా నగదు ఉన్నట్లు తెలిపినట్లు సమాచారం. మెసేజ్ రావడంతో వెంటనే బ్యాంకు అధికారులను సమాచారం ఇచ్చి బ్లాక్ చేయించినట్లు చెప్పారు.