హుధుద్: ముగ్గురి మృతి, నష్టంపై ప్రభుత్వం కొత్త యాప్
విశాఖపట్నం/హైదరాబాద్: హుధుద్ తుఫాను తీరం దాటుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం హైదరాబాదులోని సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అధికారులు అందరు అలర్టుగా ఉన్నారని తెలిపారు.
తీర ప్రాంతాల్లో ఇంట్లో నుండి ఎవరు బయటకు రావొద్దని సూచించామన్నారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో విధులు నిర్వహిస్తోందని తెలిపారు. చెట్లు కూలి ముగ్గురు మృతి చెందినట్లుగా తమకు ప్రాథమికంగా సమాచారం అందిందని తెలిపారు. ముందు జాగ్రత్తగా విశాఖలో విద్యుత్ నిలిపివేసినట్లు తెలిపారు.
విశాఖలో రాత్రి నుండి విద్యుత్ నిలపకపోతే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగేదన్నారు. పెనుగాలులు వల్ల సమాచార వ్యవస్థ దెబ్బతిన్నదని చెప్పారు. టెలిఫోన్ ఆపరేటర్లతో తాము మాట్లాడామని తెలిపారు. వరి పొలాలు బాగా దెబ్బతిన్నాయన్నారు. మరో మూడు, నాలుగు గంటలు అందరు ఇంట్లోనే ఉండాలని చంద్రబాబు కోరారు.
తుఫాను తీరం దాటేందుకు మూడు నాలుగు గంటలు పడుతుందన్నారు. ఎవరు కూడా ఇళ్ల నుండి బయటకు రావొద్దన్నారు. సాయంత్రం వరకు ఎవరు బయటకు రావొద్దన్నారు. సాయంత్రం పరిస్థితి కుదుటపడ్డాక బయటకు రావాలన్నారు. అనుకున్న సమయానికే తుఫాను తీరం దాటుతోందన్నారు. గంటకు 185 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయన్నారు.
టెక్నాలజీని గరిష్ట స్థాయిలో ఉపయోగించుకున్నామని తెలిపారు. ప్రభుత్వం ఒక మొబైల్ యాప్ తయారు చేసిందని, తుఫాను నష్టం పైన మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రజలు కూడా తుఫాను తీవ్రత ఫోటోలు, వీడియోలు పంపాలని చంద్రబాబు కోరారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఇందుకోసం రేపు, ఎల్లుండి జన్మభూమిని నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ఫేస్బుక్, గూగుల్, ట్విట్టర్, ఆర్మీ, డిఫెన్స్, టెలిఫోన్ కంపెనీలు.. ఇలా అన్ని రంగాల వారు తమకు సహకారం అందిస్తున్నారని చెప్పారు. ప్రజలకు సేవ చేయదలుచుకున్న వారు అందరు ముందుకు రావాలన్నారు.