గురుకుల్పై కెసిఆర్ సీరియస్గా ముందుకు: హెచ్చరిక
హైదరాబాద్: గురుకుల్ ట్రస్ట్ భూముల ఆక్రమణ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ముందుకు పోతోంది. నిన్నటి వరకు గురుకుల్ భూముల్లో అక్రమ కట్టడాలను కూల్చి వేసిన కేసీఆర్ ప్రభుత్వం తాజాగా.. శుక్రవారం హెచ్చరికల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. గురుకుల్ భూములను ఆక్రమిస్తే జైలుకు అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
గురుకుల్ భూములు ట్రస్ట్కు సంబంధించినవని, ఇందులో అక్రమ నిర్మాణాలు చేపట్టినా, భూములను కొనుగోలు చేసినా లేదా అమ్మినా వెంటనే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించింది. అలాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల కఠిన కారాగార శిక్ష ఉంటుందని హెచ్చరించింది. ఈ హెచ్చరికల బోర్డులను గురుకుల్ భూముల్లో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
మరోవైపు, తమ్మిడికుంట చెరువులో జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం సర్వేలు నిర్వహించారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ వెనుక ఈ తమ్మిడి కుంట చెరువు ఉంది. ఇక్కడ జీహెచ్ఎంసీ, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కొలతలు తీసుకున్నారు. కాగా, నిర్మాణంలో ఉన్న అక్రమ భవనాలను తాము కూల్చివేశామని జీహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. నిర్మాణాలు పూర్తైన అక్రమ నిర్మాణాల పైన కూడా చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా గురుకుల్ ట్రస్ట్ భూములలోను అక్రమ నిర్మాణాలను కూల్చి వేసిన విషయం తెలిసిందే. గురుకుల్ ట్రస్ట్ భూముల అక్రమాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సీరియస్ అయ్యారు. అక్రమ కట్టడాలని కూల్చివేయాలని హెచ్చరించారు. దీంతో బుధవారం వరకు నిర్మాణంలో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చి వేశారు. ఇప్పుడు హెచ్చరికల బోర్డులు పెట్టారు.