చంద్రబాబుకి మంత్రి నారాయణ షాకింగ్, పవన్ కళ్యాణ్ సహా ఒత్తిళ్లా?
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు తెలియకుండానే భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేశామన్న మంత్రి నారాయణ వ్యాఖ్యల పైన విపక్షాలు మండిపడుతున్నాయి. చంద్రబాబు భూసేకరణకు వ్యతిరేకమైతే ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.
సీఎం చంద్రబాబుకు తెలియకుండా నోటిఫికేషన్ విడుదల చేశామన్న మంత్రి పీ నారాయణ వ్యాఖ్యలు విడ్డూరమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి శుక్రవారం నాడు ఎద్దేవా చేశారు.
విపక్షాలు, మిత్ర పక్షాలైన జనసేన, బిజెపిల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడం వల్లనే టిడిపి వెనక్కి తగ్గి ఉంటుందని అంటున్నారు.
మంత్రి నారాయణ శుక్రవారం మాట్లాడుతూ... చంద్రబాబుకు తెలియకుండా భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేశామని, చంద్రబాబు కూడా భూసేకరణను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారని, సిఎం, పవన్ కళ్యాణ్ సూచన మేరకు తాము భూసేకరణ నోటిఫికేషన్ పైన వెనక్కి తగ్గుతున్నామని చెప్పారు.
నారాయణ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. చంద్రబాబుకు తెలియకుండా నోటిఫికేషన్ విడుదల చేశామని చెప్పిన నారాయణ వ్యాఖ్యల్లో నిజమెంత అనే అనుమానాలు తలెత్తుతున్నాయని పలువురు అంటున్నారు.
ఇటీవల రాజధాని గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ప్రభుత్వం బలవంతంగా భూమిని సేకరిస్తే తాను దీక్షకు సైతం దిగుతానని హెచ్చరించారు. ఆ తర్వాత రెండు రోజుల క్రితం జగన్ కూడా సీఆర్డీఏ కార్యాలయం వద్ద దీక్షకు దిగారు.
కాంగ్రెస్ పార్టీ బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తోంది. మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ కూడా బలవంతపు భూసేకరణ వద్దని, రైతులను ఒప్పించి తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని చెప్పింది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గి ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
భూసేకరణ నోటిఫికేషన్ చంద్రబాబుకు తెలియకపోయినా, తెలిసినా మొత్తానికి మంత్రి నారాయణ వ్యాఖ్యలు షాకింగ్ అని చెబుతున్నారు.
అందరికీ న్యాయం చేస్తాం: నారాయణ
రాజధాని కోసం అందరు త్యాగం చేయాలని మంత్రి పీ నారాయణ అన్నారు. ఆయన రాజధాని భూసమీకరణ గ్రామాల్లో తిరుగుతూ రైతులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజధాని కోసం అందరు త్యాగం చేయాలన్నారు. రేపు సాయంత్రం లోగా రైతుల నుంచి భూములు తీసుకుంటామని చెప్పారు. గ్రామ కంఠాలకు అన్యాయం చేయమని చెప్పారు. అందరికీ సమన్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.