వైసిపి ఎంపీల తీరుపై అనుమానాలు...గట్టిగా మాట్లాడరేంటి?
అమరావతి:ఎపికి ప్రత్యేక హోదా డిమాండ్తో తమ పదవులకు రాజీనామా చేసి న్యూఢిల్లీలోని ఏపీ భవన్ ప్రాంగణంలో ఆమరణ నిరహరదీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వైఎస్ఆర్సిపి ఎంపీల పోరాటం తీరుపై పలువురు నెటిజన్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
వైసిపి నిజంగానే చిత్తశుద్దితో పోరాడుతుంటే ఒకవైపు ఆమరణ నిరాహార దీక్ష అంటూనే కేంద్రంపై మెతక వైఖరి ఎందుకు అవలంబిస్తున్నారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ ఎంపీల ఆరోగ్యాలు క్షీణించాయని చెబుతున్న వైసీపీ అధినేత జగన్ ఈ పరిస్థితుల్లో మోడీని హెచ్చరించాల్సింది పోయి ప్రధాన మంత్రిని బ్రతిమలాడుకోవడం ఏమిటని అడుగుతున్నారు. పైగా ఢిల్లీ వేదికగా బిజెపిని,మోడీని ఒక్కమాట అనకుండా సిఎం చంద్రబాబును విమర్శించడంలో మతలబు ఏమిటనే ప్రశ్నలు సంధిస్తున్నారు.
ప్రధాని మోడీని...ఏమనరేంటి?
ఎపికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ముందు రాజీనామా...ఆ తరువాత ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్న ఐదుగురు వైసిపి ఎంపీలు గాని, ఆ పార్టీ అధినేత జగన్, గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఎవరూ ప్రధాని మోడీని విమర్శించకపోవడం ఏమిటని?...దీన్నిబట్టి టిడిపి ఆరోపిస్తున్నట్లే కేంద్రంతో లోపాయికారీగా వైసిపి లాలూచీ పడినట్లో లేక భయంతో మెతక వైఖరి అవలంబిస్తున్నట్లో కనిపిస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్లు విశ్లేషణలు చేస్తున్నారు.
టిడిపి శ్రేణులు...అనుమానాలు...
ఇక మేకపాటి దీక్ష విషయంలో తెలుగుదేశం నేతలు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఐసియులో ఉన్న వ్యక్తి గంటల వ్యవధిలోనే లేచి కూర్చోవడం ఏంటని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు?...ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఐదుగురు వైసిపి ఎంపీల్లో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే...అయితే అసలు ఎంపీలు ఎపి భవన్ లో కాకుండా ప్రధాని మోడీ నివాసం ఎదుట ఆందోళన చేయాల్సిందని, ఇప్పటికైనా మించి పోయింది లేదని, తమ ఎంపీల ఆరోగ్యం క్షీణించిందని ఆందోళన చేస్తున్న జగన్ మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలని టిడిపి మద్దతుదారులు సూచిస్తున్నారు.
టిడిపిదే ధైర్యం...అంటున్న పార్టీ శ్రేణులు ...
ప్రధాని మోడీ పేరు చెప్తేనే ఎవరైనా గడగడలాడిపోతారని కానీ ఢిల్లీ చరిత్రలోనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ప్రధాని చేసిన అన్యాయం గురించి, ఢిల్లీలో ఇలా చెప్పటం ఎన్నడూ వినలేదని ఒక సీనియర్ ఐపిఎస్ ప్రధాని మోడీ నివాసం వద్ద ధర్నా చేస్తున్న టిడిపి ఎంపీలతో అన్నారట. అలాగే తాము ప్రధాని నివాసం ముందు అంత ధైర్యంగా పోరాటం చేయడం నమ్మశక్యంగా లేదని ఆ సీనియర్ ఐపిఎస్ అధికారి టిడిపి ఎంపీలతో వ్యాఖ్యానించగా అందుకు ఒక యువ టిడిపి ఎంపీ బదులిస్తూ తాము చేస్తున్నది న్యాయమైన పోరాటమని, ఇన్నాళ్ళు మోడీ ఏదో ఒకటి చేస్తారని ఓపికగా ఆగామని, ఏమి చెయ్యరని తెలిసాక తమలోని మరో యాంగిల్ చూపిస్తున్నామని చెప్పారట. అంతేకాదు మా రాష్ట్ర ప్రజలే మా ధైర్యం...మా నాయకుడు చంద్రబాబే మా ధైర్యం...మా పార్టీ పెట్టిందే తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం అంటూ, ఆయనకి బదులిచ్చారట.
మరోవైపు...జనసేన విసుర్లు
మరోవైపు ఎపికి ప్రత్యేక హోదా కోసం టిడిపి, వైసిపి ఎంపీల పోరాటంపై జనసేన ప్రతినిధులు స్పందించారు. టీడీపీ ఎంపీల అరెస్ట్ తీరు ఏమాత్రం గౌరవప్రదంగా లేదన్నారు. అయితే వైసీపీ ఎంపీల రాజీనామాల తీరు సరిగా లేదనీ...పార్లమెంట్ నిరవధికంగా వాయిదా పడ్డాక రాజీనామా చేస్తే అది ఎప్పటికి ఆమోదం పొందాలని జనసేన ప్రశ్నించింది. టిడిపి,వైసిపి రెండు పార్టీల లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేయాలని ఈ పార్టీ సూచిస్తోంది. విజయవాడలో పవన్ పాదయాత్ర పిలుపు తర్వాతే...చంద్రబాబు హడావుడిగా సైకిల్ యాత్రకు పిలుపునిచ్చారని ఆ పార్టీ చెప్పుకొచ్చింది. అవిశ్వాస తీర్మానం విషయంలో టీడీపీ, వైసీపీకి దిక్సూచిగా నిలిచింది పవనే అని జనసేన ఉపాధ్యక్షుడు స్పష్టం చేశారు. కేసుల భయంతోనే ఆ రెండు పార్టీలు మోదీని నిలదీయలేకపోతున్నాయని జనసేన ప్రతినిధులు విమర్శలు గుప్పించారు.