పులివెందులలో మా ప్రాణాలకు ముప్పు-భద్రత కల్పించండి-ఎస్పీని కోరిన వివేకా కుమార్తె సునీత
దివంగత మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డా.సునీత కడప జిల్లా ఎస్పీని కలిసి తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు.తనకు, తన కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు ఉందని... పులివెందులలోని తమ ఇంటి వద్ద భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డా.సునీత విజ్ఞప్తిపై ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఎస్పీ కార్యాలయం నుంచి డా.సునీత బయటకొచ్చిన సమయంలో మీడియాతో ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేయగా... సున్నితంగా తిరస్కరించారు. సునీతతో పాటు ఆమె గన్మెన్ మాత్రమే ఎస్పీ కార్యాలయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మార్చి 15,2019న వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన నివాసంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా విచారణ కొనసాగుతున్నప్పటికీ... ఈ కేసులో నిందితులు ఎవరన్నది ఇప్పటికీ తేలలేదు. కేసు విచారణలో పురోగతి లేకపోవడంపై డా.సునీత గతంలో పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సీబీఐ బృందం కడపలోనే మకాం వేసి హత్య కేసును దర్యాప్తు చేస్తోంది. అనుమానితులను విచారిస్తూ వారి నుంచి కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తోంది.
Recommended Video
వివేకా హత్య కేసుకు సంబంధించి గతంలో ఇంటలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు కొందరు యత్నించారని ఆయన ఆరోపించారు. వివేకా హత్య తర్వాత ఇల్లంతా కడిగేశారని.. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించేదాకా ఘటనా స్థలాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన బంధువులు తమ అధీనంలోనే ఉంచుకున్నారని ఆరోపించారు. ఆ సమయంలో మీడియాను, ఇంటెలిజెన్స్ సిబ్బందిని అనుమతించలేదన్నారు. ఈ కేసుకు సంబంధించి తన దగ్గర సమాచారం ఉందని సీబీఐకి రెండుసార్లు లేఖ రాసినప్పటికీ ఎటువంటి స్పందన లేదన్నారు.