Muharram: ముస్లీం సోదరులు లేని ఊరిలో మోహరం పండుగ, స్వామి గుడిలో పూజలు, హిందూ అర్చకుడు!
బెంగళూరు/బెళగావి: రంజాన్ తరువాత ముస్లీంలు ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగ మోహరం. అలాంటి మోహరం పండుగ సందర్బంగా ముస్లీం సోదరులు ఎంతో భక్తిశ్రద్దలతో దేవుడికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ముస్లీం సోదరులు మోహరం పండుగ చేసుకోవడం సర్వసాధారణమైన విషయమే అనే విషయం అందరికి తెలిసిందే.
అయితే ముస్లీం సోదరులు లేని ఊరిలో మోహరం పండుగ వైభవంగా చేస్తున్నారు. అవును, ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా పచ్చినిజం. కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని సవదత్తి తాలుకాలోని హీరేబిదనూరు గ్రామంలో ప్రతి సంవత్సరం మోహరం పండుగను హిందువులు ఎంతో భక్తిశ్రద్దలతో చాలా వైభవంగా నిర్వహిస్తూ వస్తున్నారు.
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మోహరం మొదటి నెలలో వస్తోంది. హీరేబిదనూరు గ్రామంలో ఎక్కువ శాతం మంది వాల్మీకి, కురబ కులస్తులు నివాసం ఉంటున్నారు. రెండు కులాల ప్రజలు మోహరం పండుగ సందర్బంగా మసీదులో ప్రార్థనలు చేసి పండుగ జరుపుకుంటున్నారు. హీరేబిదనూరులోని ఫకీరేశ్వరస్వామీజీ గుడిలో మొదట పూజలు చేసి మోహరం పండుగ మొదలుపెడుతారు.
హీరేబిదనూరులోని ముస్లీంల ప్రార్థనా మందిరం (మసీదు)లో హిందూ పురోహితుడు పూజలు చేస్తారు. అనంతరం ఇస్లాం ఆచారం ప్రకారం హిందువులు అందరూ మోహరం పండుగ జరుపుకుంటారు. చాలా సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం హిందువులు మోహరం పండుగ జరుపుకుంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. కులాలు, మతాలు అంటూ కొట్టుకుని చస్తున్న ఈ కాలంలో కూడా హీరేబిదనూరు గ్రామంలోని హిందువులు ఎంతో భక్తిశ్రద్దలతో మోహరం పండుగ జరుపుకోవడం నిజంగా గ్రేట్ అంటున్నారు సామాన్య ప్రజలు.