అంతా మీరే చేశారు.. హవ్వా కార్లు పెట్టుకోలేని దుస్థితా..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఫైరయ్యారు. జగన్ సర్కార్ అన్నీ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. గురువారం ఆయన కుప్పంలో మీడియాతో మాట్లాడారు. జగన్ సర్కార్ చేస్తున్న పనులను తప్పుపట్టారు. రాష్ట్రాన్ని జగన్ దివాళా తీస్తున్నారని విరుచుకుపడ్డారు. మూడేళ్లలో జగన్ ప్రభుత్వం ఏ ఒక్క మంచి పని చేయలేదని ఆరోపించారు. ఇదీ జనాలకు కూడా తెలిసిందని చెప్పారు. త్వరలో బుద్ది చెబుతారని హెచ్చరించారు.
సీఎం కాన్వాయ్కు కార్లు కూడా పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం చేరుకుందని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. బిల్లులు చెల్లించాలని.. అప్పుడు అధికారులు కార్లు ఏర్పాటు చేస్తారని చెప్పారు. బిల్లులు రాకుంటే ఓనర్స్ పడే బాధకు ఎవరు బాధ్యలు అని చంద్రబాబు ప్రశ్నించారు. ఉన్న భూములను అమ్మి పాలన చేస్తామని అంటారని విరుచుకుపడ్డారు. పాలకులకు సంపద సృష్టి తెలియాలని అన్నారు. అమరావతి బంగారు కోడి అని.. రాజధాని లేకుండా చేయాలని చూడటం సరికాదని కామెంట్ చేశారు. 3 రాజధానుల పేరుతో కాలయాపన చేశారని చంద్రబాబు విమర్శలు చేశారు.
అధికారులు, ఉద్యోగులు ఒత్తిడికి గురై.. తప్పు చేసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అప్పు.. పెండింగ్లో ఉన్న బిల్లులపై వాస్తవాలు ఎందుకు చెప్పడం లేదని అడిగారు. ఇదేం పద్దతి అని నిలదీశారు. జనాలకు వాస్తవాలు తెలియజేయడం ప్రభుత్వం బాధ్యత కాదా అని అడిగారు. బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. ఇదీ మంచి పద్దతి కాదన్నారు.
రాష్ట్ర అభివృద్ది తిరోగమనంలో ఉందని చంద్రబాబు కామెంట్ చేశారు. విద్యుత్ కోతలతో జనం అల్లాడుతున్న పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జగన్ సర్కార్ చేసిన, చేస్తోన్న పనులను జనం గుర్తుంచుకున్నారని చెప్పారు. సమయం, సందర్భం చూసి తగిన బుద్ది చెబుతారని అన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరి.. చివరికీ ఇలా చేస్తారా అని నిలదీశారు. వారు చేసిన తప్పు జనాలకు తెలిసిందన్నారు. ప్రభుత్వం చేసిన, చేస్తోన్న పనులే ఇందుకు ఉదహరణగా నిలుస్తోందని వివరించారు.