జీహెచ్ఎంసీ కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి: మరికొద్ది గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
హైదరాబాద్: నవంబర్ 4వ తేదీన జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ సాధారణ ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 30 ప్రాంతాల్లో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ ఏర్పాటు చేశారు. 1 హాల్కి 14 టేబుల్స్ ఉంటాయి. ప్రతి టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్ వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు. మొత్తం కౌంటింగ్ సిబ్బంది 8152. 31 మంది కౌంటింగ్ పరిశీలకులున్నారు. కౌంటింగ్ ప్రక్రియ రికార్డింగ్కు సీసీటీవీల ఏర్పాటు చేశారు.
1 రౌండ్కి 14000వేల ఓట్లు లెక్కింపు జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంటుంది. అధికారులతోపాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి హాల్లోకి రావాల్సి ఉంటుంది. ప్రతి టేబుల్ దగ్గర సీసీ కెమెరాలతో కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా రికార్డు చేయనున్నారు.
బ్యాలెట్ లెక్కించే కంటే ముందు పోస్టల్ బ్యాలెట్లను కౌంట్ చేస్తారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 46.55 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. 74 లక్షల 67,256 ఓట్లు గ్రేటర్ పరిధిలో ఉండగా 34 లక్షల 50 వేల 331 తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 18 లక్షల 60 వేల 40 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 15 లక్షల తొంభై వేల 219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇతరులు 72 మంది జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు వేశారు.
మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుందని, ఆ తర్వాత రెగ్యూలర్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు చేపట్టనున్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. పోలింగ్ కేంద్రం పరిశీలకుడి అనుమతి తర్వాతే ఫలితాలు వెల్లడించాలని, అనుమానిత ఓట్లకు సంబంధించి రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని స్పష్టం చేసింది. అభ్యర్థులెవరైనా రీకౌంటింగ్ అవసరం అనుకుంటే ఫలితాలు వెల్లడించకముందే ఆర్వోకు తెలియజేయాలని సూచించారు. ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చిన సందర్భంలో లాటరీ పద్ధతిలో ఫలితాన్ని ప్రకటించనున్నట్లు ఎస్ఈఐ స్పస్టం చేసింది. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సెల్ఫోన్ల వినియోగం నిషేధమని తెలిపింది. కాగా, శుక్రవారం 1122 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.