భోగి పండుగ అంటే ఏంటీ... ఆ పేరు ఎలా వచ్చింది..?
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ వచ్చేసింది. భోగి మంటలు వేసి అంతా ఉత్సాహంగా గడిపారు. భోగి తర్వాత రోజు సంక్రాంతి మరుసటి కనుమ పండుగ ఉంటాయి. మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండగలో మొదటి రోజు భోగి. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో చేరుకునే రోజు. భోగి పండగ సాధారణంగా ప్రతి ఏడాది జనవరి 13 లేదా జనవరి 14 తేదీలలో వస్తుంది. ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతారు. భోగి రోజున తెల్లవారు జామునే లేచి.. అభ్యంగ స్నానమాచరించి.. కొత్త బట్టలు ధరించి కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.
భోగి పండగ రోజు సాయంత్రం చిన్న పిల్లలకు రేగి పండ్లు పోసి.. పెద్దలు ఆశీర్వదిస్తారు. భోగి రోజున పోస్తారు కనుక వీటిని భోగి పళ్ళు అంటారు, భోగి పళ్ళ ఆశీర్వాదాన్ని శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు. భోగిరోజున పిల్లలు కొత్త దుస్తులు. అయితే భోగి పళ్ళు పోయడం అనే వేడుకను సహజంగా 5 ఏళ్ళు లోపు పిల్లలకు చేస్తారు. సాయంత్రం వేళ ఇరుగుపొరుగు వారిని పిలిచి.. పిల్లలకు హారతి ఇచ్చి, దిష్టి తీయిస్తారు. గుప్పిట నిండా భోగి పళ్ళు, డబ్బులు, పువ్వులు కలిపి వాటిని గుపెల్లతో తీసుకుని, మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా పోస్తారు. అయితే ఇలా చేయడం వెనుక ఒక శాస్త్రీయ కోణం దాగి ఉందని అంటారు.
భోగి పండ్లు పోస్తున్న సమయంలో రేగి పండ్లు నుండి వచ్చే వాయువు పిల్లల తల పైన బ్రహ్మ రంధ్రానికి శక్తిని ఇస్తుంది. మేధస్సు మరింత పెరుగుతుంది. రేగు పండ్లు తల పైన నుండి పోయడం వలన ఆ సమయంలో పళ్ళు తలలోని మెదడు లోని నరాలకు రేగి పండ్ల నుండి వచ్చే వాయువు వల్ల ఆక్టివ్ అవుతారు. శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు జ్వరం వంటి సీజనల్ వ్యాధులు పిల్లలను ఇబ్బంది పెడుతుంటాయి. ఈ రేగి పళ్లలో అరా ఎక్కువగా ఆకర్షించే గుణం వల్ల పిల్లలకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. పిల్లలకు శారీరకంగా సీజనల్ వ్యాధులను ఎదుర్కొనే శక్తి రావాలి అనే ఉద్దేశంతో భోగి పండగ రోజున రేగుపళ్ళను పోస్తారు.