గచ్చిబౌలిలో కారు బీభత్సం: ముగ్గురు మృతి, మద్యం మత్తులో డ్రైవింగ్ ప్రమాదానికి కారణం!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ప్రమాద ఘటన మరువకముందే గచ్చిబౌలిలో మరో కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలి ఎల్లా హోటల్ సమీపంలోని రహదారి మధ్యలో చెట్లకు నీరు పెడుతున్న మహేశ్వరమ్మ(38) అనే మహిళను కారు వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మహేశ్వరమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మహిళను ఢీకొన్న తర్వాత కారు బోల్తా పడటంతో కారులో ఉన్న రోహిత్, గాయత్రి తీవ్రంగా గాయపడ్డారు. వారిద్దరినీ చికిత్స నిమిత్తం ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నట్లు తెలిసింది.
ఇది ఇలావుండగా, గురువారంనాడు జూబ్లీహిల్స్లో ఎమ్మెల్యే స్టికర్ ఉన్న ఓ కారు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రెండున్నర నెలలున్న పసికందు మృతి చెందగా, ఏడాది వయస్సున్న బాలుడితోపాటు ముగ్గురు మహిళలు గాయపడ్డారు. ఆ కారుపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ ఉంది. ఆ కారు తన బంధువులదని, తాను కూడా అప్పుడప్పుడు వాడుతానని షకీల్ తెలిపారు. ప్రమాద సమయంలో కారు నడిపింది తన కుమారుడు కాదని, తన కజిన్ మీర్జా కుమారుడని తెలిపారు. నిందితులపై చట్ట ప్రకారం పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాద బాధితులకు అండగా ఉంటామన్నారు.
ట్రాక్టర్ డ్రైవర్కు గుండెపోటు.. అదుపుతప్పి ముగ్గురు మృతి
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం చిన్నంబావిలో ట్రాక్టర్ అదుపుతప్పి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శేరిగూడెం గ్రామంలో ఇటుకలను దించేసి తిరిగి వస్తున్న సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ ఎల్లయ్యకు గుండెపోటు వచ్చింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ట్రాక్టర్ అదుపుతప్పి పక్కకు పల్టీలు కొట్టింది.
ఈ ఘటనలో డ్రైవర్ తోపాటు ట్రాక్టర్ ఇంజిన్పై కూర్చున్న సీతారాం, దుర్గ అనే ఇద్దరు కూలీలు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాకు చెందిన వీరంతా ఇటుకల బట్టీలో కూలీలుగా పనిచేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.