వేర్వేరు గదుల్లో.. ప్రశ్నలు పోల్చుకొని.. 8 గంటలు విచారణ: రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే?
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి విచారణ ముగిసింది. ఓటుకు నోటు కేసులో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆయనను ఎనిమిది గంటలకు పైగా విచారించారు. మధ్యాహ్నం పదకొండున్నర గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు విచారించారు. అరగంట పాటు విరామం ఇచ్చారు.

వేర్వేరుగా విచారించిన ఐటీ, ఏసీబీ
రేవంత్ రెడ్డిని ఐటీ, ఏసీబీ అధికారులు వేర్వేరు గదుల్లో విచారించారు. అనంతరం ఈడీ అధికారులు రేవంత్ ఇరువురికి చెప్పిన సమాధానాలను పోల్చుకున్నారు. ఐటీ, ఏసీబీ అధికారులతో చెప్పిన జవాబులతో పోల్చుకున్నారు. స్టీపెన్సన్కు ఇచ్చిన రూ.50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. సుదీర్ఘ విచారణ అనంతరం రేపు బుధవారం మరోసారి రావాలని చెప్పింది. దీంతో రేవంత్ రేపు కూడా విచారణకు హాజరు కానున్నారు.

మీడియాతో రేవంత్ రెడ్డి ఏమన్నారంటే
విచారణ అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో తమ ఎదుట హాజరు కావాలని ఈడీ తనకు నోటీసులు ఇచ్చిందని చెప్పారు. బాధ్యతగల పౌరుడిగా తాను ఈ విచారణకు హాజరయ్యానని చెప్పారు. ఎన్నికల సమయంలో తనపై నమోదైన కేసును ఈడీ విచారించిందని చెప్పారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. రేపు కూడా విచారణకు రావాలని ఈడీ ఆదేశించిందని చెప్పారు.

ఈ కేసు వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
నాలుగేళ్ల తర్వాత ఈ కేసుపై ఈడీ విచారణ వెనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసు విచారణపై గత వారం వేం నరేందర్ రెడ్డి కూడా అనుమానం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు బయటకు తీశారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వమే ఈ కేసును కేంద్రానికి అప్పగించిందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications