అమావాస్య "చంద్రుడు".. సెంటిమెంట్ వర్కవుట్.. కొత్త ప్రభుత్వం ఎప్పుడు?
హైదరాబాద్ : శుభాలకు అమావాస్య మంచి రోజు కాదని చాలామంది విశ్వసిస్తారు. ఆ రోజు ముఖ్యమైన పనుల్ని వదిలేస్తారు. అంతలా అమావాస్యపై జనాలకు అపనమ్మకముంటే.. గులాబీ చంద్రుడికి మాత్రం కలిసొచ్చింది. తెలంగాణ ఎన్నికలు జరిగిన రోజు అమావాస్య కావడంతో చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. జ్యోతిషం, వాస్తుశాస్త్రాలను బలంగా నమ్మే కేసీఆర్ కు అమావాస్య రూపంలో ముప్పు పొంచి ఉందని అభిప్రాయపడ్డారు. అయితే అవన్నీ నిజం కాదని నిరూపిస్తూ మరోసారి జయకేతనం ఎగురవేశారు.
టీఆర్ఎస్ భారీ విజయం, గులాబీ సంబరాలు (ఫోటోలు)
ఎన్నికల సందర్భంలో సిద్ధిపేట సమీపంలోని కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కేసీఆర్ వెళుతుండటం ఆనవాయితీ. అదేక్రమంలో ఈ ఎన్నికల్లో సైతం అదే ఫాలో అయ్యారు. పార్టీ అభ్యర్థులకు ఇచ్చే బీ-ఫామ్స్ స్వామి వారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతేకాదు ఆయన నామినేషన్ దాఖలు చేసేటప్పుడు కూడా అక్కడి వెంకన్నను దర్శించుకున్నారు.
అమావాస్యను గెలిచిన చంద్రుడు.. కేసీఆర్ ఫార్ములా సక్సెస్..!
ముందస్తు ఎన్నికలకు ముహుర్తం చూసుకున్న కేసీఆర్.. సెప్టెంబర్ 6వ తేదీన అసెంబ్లీ రద్దు చేశారు. ఆరో నెంబర్ తనకు కలిసొస్తుందని ఆయన నమ్మకం. అయితే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించడంతో పోలింగ్ తేదీ చూసి చాలామంది కంగుతిన్నారు. ఆరోజు అమావాస్య అంటూ, కేసీఆర్ కు కలిసిరాదంటూ చాలా కథలు వార్చి వండేశారు. ఇక కేసీఆర్ పని అయిపోయిందంటూ లేనిపోని కూతలు కూశారు. అవన్నీ కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. గులాబీ చంద్రుడికి అమావాస్య ఏమాత్రం అడ్డంకిగా మారలేదు. పైగా బంపర్ మెజార్టీ తెచ్చిపెట్టింది.
కొత్త ప్రభుత్వానికి ముహుర్తమెప్పుడో?
జ్యోతిషం, వాస్తు శాస్త్రాలను బలంగా విశ్వసించే కేసీఆర్ తాను ఏ పని తలపెట్టినా.. తొలుత పండితులను సంప్రదిస్తారు. ముహుర్తబలాలు ఏవిధంగా సరిపోలుతాయో చూసుకుంటారు. 3-4 ముహుర్తాలు చూసుకుని అందులో బలమైనరోజుకి మొగ్గుచూపుతారు. ఇప్పటివరకు ఇదే ఫాలో అయిన కేసీఆర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఏ రోజును ఎంచుకుంటారో అన్నది చర్చానీయాంశంగా మారింది. ఒకవేళ 6 కలిసివచ్చేలా చూసుకుంటే ఈనెల 15వ తేదీని ఖరారు చేస్తారేమో. మూఢంతో పాటు మంచిరోజులు లేవనుకుంటే 12వ తేదీనే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశముంది.
కోనాయిపల్లి వెంకన్న కరుణ.. మరోసారి పగ్గాలు
పొలిటికల్ లైఫ్ లో సిద్దిపేట సమీపంలోని కోనాయిపల్లి వెంకన్న మహిమను బాగా నమ్ముతారు కేసీఆర్. ఆయన కరీంనగర్, మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీచేసిన సందర్భంలోనూ, ఉద్యమ సమయంలో భారీ బహిరంగ సభలు పెట్టినప్పుడు గానీ ఈ స్వామి వారి ఆశీస్సులే తీసుకున్నారు. కోనాయిపల్లి వెంకన్నను దర్శించుకున్న తర్వాత కేసీఆర్ తలపెట్టిన ఏ కార్యక్రమమైనా విజయవంతమైంది. అదేక్రమంలో ఈసారి కూడా ఆ స్వామివారినే కేసీఆర్ నమ్ముకోవడంతో టీఆర్ఎస్ కు బంపర్ మెజారిటీ లభించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.