పోలీసు రాత పరీక్ష ఫలితాలు విడుదల: ఎస్ఐ పోస్టుకు 46.80 శాతం పాస్
పోలీసు నియామకాలకు సంబంధించి రాతపరీక్ష ఫితాలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది. 554 ఎస్ఐ పోస్టులకు ఆగస్టు 7వ తేదీన, 15,644 కానిస్టేబుల్, 63 ట్రాన్స్పోర్టు కానిస్టేబుల్, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులకు ఆగస్టు 28న రాత పరీక్ష నిర్వహించారు. ఆ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి.
మొత్తం ఎస్ఐ పోస్టులకు 2,25,668 మంది రాత పరీక్ష రాయగా 1,05,603 (46.80 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 5,88,891 మంది రాత పరీక్ష రాయగా 1,84,861 (31.39 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్పోర్టు కానిస్టేబుల్ పోస్టులకు 41,835 మంది రాత పరీక్ష రాయగా 18,758 (44.84 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 2,50,890 మంది రాత పరీక్ష రాయగా, 1,09,518 (43.65 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకల ట్యాగ్ లైన్ మీద. అయితే ఆశించిన మేర కొలువులు భర్తీ చేయడం లేదు. దీంతో సర్వత్రా విమర్శలు వచ్చాయి. అందుకే సీఎం కేసీఆర్ భారీ ఉద్యోగ ప్రకటన చేశారు. అసెంబ్లీలో ఆ ప్రకటన చేసి.. మెల్లిగా నియామక ప్రక్రియ చేపడుతున్నారు.