30వ తేదీన టెన్త్ ఫలితాలు.. ఉదయం 11.30 గంటలకు విడుదల
కరోనా వల్ల రెండేళ్లు పరీక్షలు రాయకుండానే పదో తరగతి విద్యార్థులు పాసయ్యారు. ఈ సారి మాత్రం పరీక్షలు రాయగా.. 30వ తేదీ గురువారం ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరిగాయి. కరోనా వల్ల రెండేళ్లుగా పరీక్షలు లేకుండానే విద్యార్థులను పాస్ కాగా.. రెండేళ్ల గ్యాప్ తర్వాత పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఏ మేర ఉత్తీర్ణత సాధిస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇటు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు జులై 1వ తేదీన విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేస్తారు. మార్చి 24న టెట్ నోటిఫికేషన్ను విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 12వ తేదీన పరీక్ష నిర్వహించారు. నోటిఫికేషన్ విడుదల సమయంలో ఫలితాలను జూన్ 27న ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
పరీక్షకు సుమారు 90% మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం నిర్వహించిన పేపర్-1కు 90.62 శాతం, పేపర్-2కు 90.35శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. గత పరీక్షలతో పోలిస్తే ఈసారి ప్రశ్నల సరళి సులువుగా ఉందని పలువురు అభ్యర్ధులు అభిప్రాయ పడ్డారు. ఈ సారి అధిక సంఖ్యలో టెట్ పరీక్షలో అర్హత సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.