2 రోజులు అసెంబ్లీ సెషన్, ఏకపక్ష నిర్ణయం: భట్టి విక్రమార్క, పని గంటలు మాత్రం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణ గురించి బీఏసీ సమావేశమైంది. సమావేశాల గురించి ప్రతిపక్షం నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. చిట్చాట్లో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు 20 రోజులు నిర్వహించాలని బీఏసీలో కోరామన్నారు. 12,13 తేదీల్లో మాత్రమే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోందని తెలిపారు. పని దినాలు కాక పని గంటలను పెంచుతామని చెబుతున్నారు.
అక్రమ అరెస్టులు..
ముంపు, నిరుద్యోగం, వరదలు, ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్న ఎమ్మెల్యేల అక్రమ అరెస్ట్ తదితర అంశాలపై చర్చించాలని కోరామని భట్టి విక్రమార్క అన్నారు. కనీసం 15, 20 రోజులు సభ జరిగితే చాలా అంశాలు చర్చకు వచ్చేవని అభిప్రాయపడ్డారు. విభజన హామీలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడడం లేదని తెలిపారు. దీనిపై మరింత ఎక్కువగా చర్చ జరగాలన్నారు.
పద్దులపై చర్చ..
సమావేశాల నిర్వహణ, పద్దులపై చర్చించారు. ప్రభుత్వం తరఫున మంత్రులు, చీఫ్విప్, కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్గ, ఎంఐఎం తరఫున అక్బరుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. భేటీలో ఈ నెల 12, 13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని కోరాయి. సమావేశాలు నిర్వహించే రోజులు తగ్గుతున్నాయని కాంగ్రెస్, మజ్లిస్ పేర్కొన్నాయి. పని దినాలు తగ్గినా.. పని గంటలు ఎక్కువగా ఉంటున్నాయని, బిజినెస్ ఎప్పటికప్పుడు పూర్తి చేస్తున్నామని మంత్రులు పేర్కొన్నారు.
నిమజ్జనం, సమైక్య ఉత్సవాలు
వినాయక నిమజ్జనంతోపాటు తెలంగాణ జాతీయ సమైక్య ఉత్సవాల దృష్ట్యా సమావేశాలు ఎక్కువ రోజులు సభను నిర్వహించలేకపోతున్నామని మంత్రులు పేర్కొన్నారు. అవసరమైతే శీతాకాల సమావేశాలను మరోసారి 14 రోజుల పాటు నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తామని మంత్రులు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చర్చించాలని కాంగ్రెస్, మైనారిటీలు, హైదరాబాద్ సమస్యలపై చర్చించాలని ఎంఐఎం కోరింది. రాష్ట్రం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరితో పాటు వివిధ అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రులు పేర్కొన్నారు. సమావేశాల్లో పలు బిల్లులతో పాటు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు మంత్రులు పేర్కొన్నారు.
రెండు రోజులు
గతంలో వాయిదాపడ్డ శాసనసభా సమావేశాలకు కొనసాగింపుగా.. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశం ప్రారంభమైన అనంతరం తుంగుర్తి మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం, కమలాపూర్ మాజీ ఎమ్మెల్యే పరిపాటి జనార్దన్రెడ్డికి సభ సంతాపం ప్రకటించింది. ఇద్దరి మృతికి సంతాపం పాటిస్తూ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీని వాయిదా వేశారు.