అంబులెన్స్గా నేవీ ఫ్లైట్: గుండెను తెచ్చి ప్రాణం నిలిపారు
కొచ్చి: తిరువనంతపురంలో బ్రెయిన్ డెడ్ పేషెంట్ నుంచి సేకరించిన గుండెను కొచ్చి ఆస్పత్రికి తరలించి ఓ ఆటో డ్రైవర్కు ప్రాణం పోశారు. ఇందుకోసం నావికా దళానికి చెందిన విమానాన్ని ఉపయోగించడం విశేషం. దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరాన్ని నలభై నిమిషాల్లో అధిగమించి గుండెను లిస్సీ ఆస్పత్రికి తరలించారు.
వైద్యులతో పాటు నావికాదళ సిబ్బంది కాలంతో పోటీపడి పరుగులు పెట్టడంతో ఆటో డ్రైవర్ మాథ్యూ అచాదన్(47)కు ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే... తిరువనంతపురంలోని శ్రీచిత్ర ఆస్పత్రిలో నీలకంఠం శర్మ అనే వ్యక్తిని బ్రెయిన్ డెడ్గా వైద్యులు నిర్ధారించారు.
అతని కుటుంబసభ్యులను అవయవదానానికి ఒప్పించి వైద్యులు అతని గుండెను సేకరించారు. గుండెను కొచ్చికి తరలించడానికి తొలిసారిగా నావికాదళానికి చెందిన డార్నియర్ విమానంను ఉపయోగించారు.
ఆపై లిస్సి ఆస్పత్రికి చెందిన గుండె వైద్య నిపుణుడు జోస్ పెరియప్పురం ఆధ్వర్యంలోని వైద్య బృందం ఆరు గంటల పాటు శ్రమించి ఈ గుండెను మాథ్యూ అనే ఆటో డ్రైవర్కు అమర్చారు. దీంతో అతని ప్రాణాలు నిలిచాయి.