సోమవారం ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష... అరవింద్ కేజ్రీవాల్ నెగ్గేనా??
దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. ఆమ్ ఆద్మీ, భారతీయ జనతాపార్టీ మధ్య రాజకీయ రగడ తీవ్ర రూపం దాలుస్తోంది. ఆపరేషన్ కమలం ఢిల్లీలో విఫలమైందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. ఎమ్మెల్యేలవెరూ తమ పార్టీని వీడటంలేదనే విషయాన్ని చాటిచెప్పేందుకు ఈనెల 29వ తేదీన స్వయంగా విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అరవింద్ మాట్లాడారు.
సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి మోడీపై కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. గుజరాత్ ఎన్నికల్లో ఆప్ పోటీచేయడంలేదని ప్రకటిస్తే సీబీఐ, ఈడీ దాడులు ఆగిపోతాయని, దేశవ్యాప్తంగా బీజేపీ ఇప్పటివరకు 277 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని వెల్లడించారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను 29వ తేదీ వరకు పొడిగించారు.
అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆప్ ఎమ్మెల్యేలు ఖోఖా ఖోకా అంటూ నినాదాలు చేశారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోందని చెప్పడానికి ఉద్దేశంగా వారు ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతిగా మద్యం కుంభకోణాన్ని ఉద్దేశించి ధోకా ధోకా అంటూ బీజేపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ చీఫ్ విప్ అజయ్ మహావర్ అసెంబ్లీ కార్యకలాపాలను వీడియో తీశారంటూ ఆప్ ఎమ్మెల్యే ఆరోపించారు. దీనిపై స్పీకర్ ప్రశ్నించగా ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో మొత్తం 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి పంపించి వేశారు. వారంతా అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.