రజనీపై విరుచుకుపడ్డ నటుడు శరత్ కుమార్, విశాల్పైనా...
చెన్నై: రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్పై నటుడు శరత్ కుమార్ ధ్వజమెత్తారు. సినిమాల విడుదల సమయంలో ప్రచారం కోసం రజనీ రాజకీయాలను వాడుకుంటున్నారని అన్నారు.
రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చనని ఆయన అన్నారు. అయితే రజనీ చెబుతున్న ఆధ్యాత్మికత, సెక్యులర్ విలువలేంటో ఎన్నికల సమయంలో తెలుస్తుందని ఆయన అన్నారు. అప్పుడే రజనీకాంత్ వెనకున్న రాజకీయ శక్తులు కూడా బయటకు వస్తాయని చెప్పారు.
తమిళులు, కన్నడిగుల మధ్య కావేరి, మేగదారు సమస్యలు వచ్చినప్పుడు రజనీ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రజనీకి ధైర్యం ఉంటే కర్ణాటక నుంచి ఇప్పుడు ఎన్నికల బరిలోకి దిగగలరా అని సవాల్ చేశారు.
జయలలిత, కరుణానిధిలు రాజకీయాల్లో ఉన్నప్పుడు రజనీ ఎందుకు రాజకీయ ప్రవేశం చేయలేదని అడిగారు. యువతరానికి రాజకీయాల్లో దారి ఇవ్వండని చెప్పిన విశాల్ ఇప్పుడు ఆ విషయాన్ని కొంచెం రజనీ చెవిలో చెబుతారా అని మండిపడ్డారు.