తిక్క కుదిరింది: ఆ పర్యాటక ప్రాంతంలో ఆల్కాహాల్ బ్యాన్
గోవా... భూమిపై ఇదో స్వర్గం అని చాలా మంది అభిప్రాయం. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం... సముద్రంలో ఎగిసిపడుతున్న అలలు, అక్కడి సంస్కృతి అన్నీ చాలా బాగుంటాయి. భారత్లో విహారయాత్రకు బెస్ట్ ప్లేస్ ఏది అంటే నోట్లోనుంచి టక్కున వచ్చే సమాధానం గోవా. గోవాలో మద్యం కూడా చాలా తక్కువ ధరకే దొరకడంతో మందుబాబులకు ఫేవరెట్ టూరిజం స్పాట్గా గోవానే ముందు వరుసలో ఉంటుంది. అయితే ఇప్పుడు గోవాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే భారీ జరిమానా విధించేందుకు అక్కడి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏంటి నమ్మలేకున్నారా.. ఇది అక్షర సత్యం.
ఆర్థిక అభివృద్ధి సమాఖ్య కార్యక్రమాన్ని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు భారీగా జరిమానా కూడా విధిస్తున్నట్లు సీఎం చెప్పారు. దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. గోవాకు చాలామంది పర్యాటకులు వచ్చి మద్యం తప్పకుండా సేవిస్తారు. మరలాంటప్పుడు సీఎం నిర్ణయం ఒక్కింత విస్మయానికి గురిచేసిందని ఆ రాష్ట్ర ప్రజలు చెబుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యపాన నిషేధం వచ్చేనెల 15 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం, ప్లాస్టిక్ సంచుల వినియోగంపై ఉన్న జరిమానా కూడా పెంచుతున్నట్లు ప్రకటించారు.
" పౌరులు బాధ్యత కలిగి ఉండటమే కాదు.. బాధ్యతతో ప్రవర్తించాలి పనాజీ నగరంలోని నది ఒడ్డున ఫుట్ పాత్ నిర్మిస్తే చాలామంది అక్కడ బీర్లు తాగి బాటిళ్లను అక్కడే పడేస్తున్నారు" అని పారికర్ చెప్పారు. అందుకే బహిరంగ ప్రదేశాల్లో మందు కొడితే భారీ జరిమానా విధిస్తామని వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, ప్లాస్టిక్ సంచులు వినియోగించినా ప్రస్తుతం జరిమానా రూ.100గా ఉంది. ఇక దాన్ని రూ.2500కు పెంచుతామని పారికర్ స్పష్టం చేశారు. పారికర్ నిర్ణయంతో ఒక్కసారిగా మందుబాబులకు తాగకుండానే మత్తెక్కినట్లయ్యింది పరిస్థితి.