పఠాన్కోట్: ఆరో ఉగ్రవాది హతం, ఎలా వచ్చారు?
పఠాన్కోట్: సుమారు 60గంటలపాటు ఉగ్రవాదులతో పోరాడిన మన భద్రతా దళాలు సోమవారం సాయంత్రం ఆరో ఉగ్రవాదిని హతమార్చి ఆపరేషన్ను పూర్తి చేసింది. శనివారం నుంచి సోమవారం వరకు మూడ్రోజులపాటు భారత సైన్యం పోరాడి మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దీంతో ఎయిర్బేస్ సురక్షితంగా మారింది.
రెండు బృందాలుగా ప్రవేశించిన ఉగ్రవాదులు
పఠాన్కోట్లోని భారత వైమానిక స్థావరంలోకి చొరబడిన పాక్ ఉగ్రవాద ముష్కరులు రెండు బృందాలుగా ప్రవేశించినట్టు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. సాధారణంగా ఉగ్రవాద ముఠాకు చెందిన ఆత్మాహుతి దళాలు ఒక్కసారిగా దూసుకువస్తాయి. పఠాన్కోట్లో మాత్రం రెండు బృందాలుగా ప్రవేశించి కొత్త వ్యూహానికి తెరతీసినట్టు తెలిసింది.
మొదట నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాదళాలు మరో ఇద్దరు నక్కివున్నారన్న సంగతి తెలుసుకొని తిరిగి ఆపరేషన్ ప్రారంభించాయి. పంజాబ్ ఎస్పీ నుంచి లాక్కున్న ఫోన్ ద్వారా ఒక బృందానికి చెందిన ఉగ్రవాదులు మరో బృందంతో మీరెందుకు వెనుకబడివున్నారని ప్రశ్నించడాన్ని నిఘావర్గాలు గుర్తించాయి.
ఉగ్రవాదులు అత్యంత కఠినమైన శిక్షణ పొందివున్నట్టు తెలుస్తోంది. స్వయంగా పాక్సైన్యమే వీరికి శిక్షణ ఇచ్చినట్టు సమాచారం. ముంబైలో గతంలో దాడులు చేసిన వారికంటే పఠాన్కోట్లో ప్రవేశించిన ఉగ్రవాదులు శిక్షణ పొందిన వుండటం గమనార్హం.
పఠాన్కోట్పైనే దాడి ఎందుకు?
పంజాబ్లోని పఠాన్కోట్ ప్రాంతం పాక్ సరిహద్దుకు సమీపంలోనే వుంది. ఈ ప్రాంతం వ్యూహాత్మకంగా కీలకం కావడంతో భారత సైనిక డివిజన్తో పాటు భారత వాయుసేన స్థావరాలున్నాయి. వైమానిక స్థావరంలో మిగ్యుద్ధ విమానశ్రేణికి చెందిన యుద్ధవిమానాలున్నాయి.
భూఉపరితలంనుంచి ఆకాశంలో లక్ష్యాలను ఛేదించే క్షిపణులు ఇక్కడవున్నాయి. దీని విశిష్టతను గుర్తించిన పాక్ గతంలోనూ 1965, 71 యుద్ధాల్లో దాడులకు పాల్పడింది. రెండు వేల ఎకరాలకు పైగా వున్న ఈ స్థావరం ఒక చిన్న నగరంలాంటిది. ఇంత విశాలమైన స్థావరాన్ని ఎయిర్ఫోర్స్కు చెందిన ప్రత్యేక కమాండో దళం ‘గరుడ' నిత్యం పహారా కాస్తుంది.
కార్గిల్ యుద్దంలోనూ ఇక్కడ నుంచే వాయుసేన ఆపరేషన్ సఫేద్సాగర్ పేరుతో మిలిటెంట్లపై దాడులు నిర్వహించింది. 2001లో భారత పార్లమెంటుపై దాడి అనంతరం ఆపరేషన్ పరాక్రమ్ పేరుతో భారత సైనికదళాలు పాక్ సరిహద్దు వెంబడి సాయుధ దళాలను మొహరించాయి. పఠాన్కోట్ నుంచే వ్యూహరచన సాగడం విశేషం.
పాక్తోనూ పాక్ ఉగ్రవాద ముఠాలతోనూ భవిష్యత్లో జరిగే ఎలాంటి పోరాటంలోనైనా పఠాన్కోట్ వాయుసేన స్థావరం కీలకపాత్ర పోషిస్తుంది. దీన్ని దృష్టిలో వుంచుకునే పాక్ ఉగ్రవాదులతో పాటు పాక్ సాయుధదళాలు ఈ స్థావరంపై సుదీర్ఘకాలంగా కన్నువేశాయి. అయితే భారత దళాలు వీరిని సమర్థంగా అడ్డుకోవడంతో పాటు ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.