సలీం షేక్.. దేశం మెచ్చిన ధీశాలి: 50మంది ప్రాణాలను కాపాడిన సాహసి..
అమరనాథ్ యాత్రికులను కాపాడిన ఆ డ్రైవర్ ధైర్య సాహాసాలను యావత్ భారతం కొనియాడింది. అతనే సలీం షేక్.
ఆ ఒక్కడు అప్రమత్తంగా వ్యవహరించకపోతే 50మంది నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఉగ్రవాదుల తూటాలు వారి శరీరాలను ఛిద్రం చేసేవి. ప్రయాణికులంతా ఆందోళనతో కేకలు పెడుతున్నా.. అతను మాత్రం ఎక్కడా ఆందోళనకు లోనవ్వలేదు.
తూటాలను తప్పించుకుంటూ బస్సును అతివేగంగా పరుగులు పెట్టించాడు. అలా ఒక కి.మీ దూరం వెళ్లాక గానీ బస్సును ఆపలేదు. డ్రైవర్ అలా చేయబట్టే ఆ యాభై మంది ప్రాణాలతో బయటపడ్డారు. అమరనాథ్ యాత్రికులను కాపాడిన ఆ డ్రైవర్ ధైర్య సాహాసాలను యావత్ భారతం కొనియాడింది. అతనే సలీం షేక్.
అమరనాథ్ యాత్ర సందర్భంగా ఉగ్రవాదులు సంధించిన తూటాలను చేధించుకుంటూ బస్సును వేగంగా నడిపిన సలీం.. తనతో పాటు 50మంది ప్రాణాలను నిలబెట్టాడు.
ఉగ్రవాదులు తుపాకులతో కాల్చే తూటాలకు మతం లేనట్లే తనకూ మతం లేదని చెప్పే సలీం చెప్పడం చాలామందికి ముస్లింల పట్ల ఉన్న దురాభిప్రాయాన్ని సైతం దూరం చేసేలా చేసింది. 50మందిని కాపాడినప్పటికీ.. మరో ఏడుగురు బలైపోయినందుకు సలీం తీవ్ర ఆవేదనవ వ్యక్తం చేశాడు.
తాను ముస్లిం అయినప్పటికీ.. 40ఏళ్లుగా శివుడిని ఆరాధిస్తున్నానని అతను చెప్పడం అన్ని మతాల పట్ల అతనికున్న సమదృష్టిని తెలియపరిచింది. 'అల్లా, శివుడి ఆదేశాల మేరకే.. బలం మేరకే బస్సును అంత స్పీడుగా ముందుకు నడిపి ఉంటా'నని అతను పేర్కొనడం అతని స్ఫూర్తిని తెలియజేస్తోంది.
ఘటనానంతరం ఎవరెంత పొగిడినా సలీం ఉబ్బితబ్బిబ్బయిపోలేదు. తన బాధంతా.. ఆ మిగతా ఏడు మందిని కాపాడి ఉండాల్సిందని ఆవేదన చెందాడు. బస్సు ఎక్కడికి పోతున్నదో తెలియదు గానీ స్టీరింగ్ మీద నుంచి తన చేయిని తీయలేదని సలీం షేక్ చెప్పడం.. వారిని కాపాడాలని ఆయనెంతగా ప్రయత్నించారో స్పష్టం చేస్తోంది.
'భారతీయుడిగా గర్విస్తాను.. చాలామంది లాగే నాకూ రాజకీయాలు తెలియవు. నాబోటివాళ్లు ప్రశాంతంగా జీవించేందుకు అనువుగా శాంతి నెలకొనాలని కోరుకుంటాను'.. ఇదీ సలీం నమ్మిన సిద్దాంతం. అందుకే అంతటి విపత్కర పరిస్థితుల్లోను తన ఒక్కడి గురించి ఆలోచించకుండా.. తనతో పాటు మరో 50మంది ప్రాణాలతో బయటపడేలా చేశాడు. ఈ సాహస వీరుడికి 'సలాం' చెప్పకుండా ఎలా ఉండగలం.