నాకు వెన్నుపోటు పొడిస్తే పొడిచారు గానీ..వాళ్లతో ఆటలొద్దు: పెదవి విప్పిన ఉద్ధవ్: రాజీనామా తరువాత
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న నంబర్ గేమ్లో అధికార మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఓడిపోయింది. ఏక్నాథ్ షిండే తిరుగుబాటు లేవనెత్తిన తరువాత అతి కొద్ది రోజుల్లోనే.. శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ సంకీర్ణ కూటమి సర్కార్ కుప్పకూలింది. శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తన పదవికి రాజీనామా చేశారు. శాసనసభలో బలపరీక్షకు ముందే ఆయన పదవి నుంచి తప్పుకొన్నారు.
శరద్ పవార్కు కష్టాలు షురూ: లవ్ లెటర్..పాత కేసులు తవ్వి తీస్తోన్న షిండే సర్కార్
ఆ నిర్ణయంపై కలకలం..
మహా వికాస్ అగాఢీ స్థానంలో ఏక్నాథ్ షిండే-భారతీయ జనతా పార్టీ సారథ్యంలో మరో సంకీర్ణ సర్కార్ అక్కడ ఏర్పాటైంది. తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్నారు. ప్రభుత్వాన్ని నెలకొల్పిన కొన్ని గంటల వ్యవధిలోనే షిండే సర్కార్ తీసుకున్న నిర్ణయం.. కలకలం రేపింది.
ఉద్ధవ్ సర్కార్ నిర్ణయానికి భిన్నంగా..
ఇదివరకు అత్యంత వివాదాస్పదమైన ముంబై ఆరీ కాలనీలో మెట్రో కార్ షెడ్ నిర్మించాలని నిర్ణయించింది. ఆరీ కాలనీని ఇదివరకు ఉద్ధవ్ సర్కార్.. రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించిన విషయం తెలిసిందే. కొలాబా-బాంద్రా-సీప్జ్ మెట్రో 3 కారిడార్ నిర్మాణాన్నిఉద్ధవ్ ప్రభుత్వం రద్దు చేసింది. దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు ఆరీ కాలనీకి బదులుగా కంజూర్మార్గ్లో మెట్రో కార్ షెడ్ నిర్మించాలని తీర్మానించింది.
తొలి కేబినెట్ భేటీలో..
ఇప్పుడదే యారీ కాలనీ రిజర్వ్ ఫారెస్ట్లో మెట్రో కార్ షెడ్ను నిర్మించాలని షిండే సర్కార్ నిర్ణయించింది. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉద్ధవ్ థాకరే స్పందించారు. ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. షిండే సర్కార్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు.
బీజేపీపైనా..
ఈ క్రమంలో బీజేపీ అధిష్ఠానాన్నీ వదిలి పెట్టలేదు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై విమర్శలు సంధించారు. బీజేపీ నేతలు వెన్నుపోటు పొడిచారని తేల్చి చెప్పారు. ఏక్నాథ్ షిండేను ఆయుధంగా ఉపయోగించుకున్నారని ఆరోపించారు. తనకు వెన్నుపోటు పొడిచినట్లుగా ఇప్పుడిక ముంబైకర్లను వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ముంబైకర్ల జీవితాలతో ఆటలాడుకోవద్దంటూ ఉద్ధవ్ థాకరే హెచ్చరించారు.
యారీ కాలనీ కొనసాగింపు..
యారీ కాలనీ రిజర్వ్ ఫారెస్ట్ను యధాతథగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల అనుకూలంగా తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మార్చొద్దని సూచించారు. యారీ కాలనీలో చెట్లను నరకడాన్ని ఇదివరకు పర్యావరణవేత్తలు తప్పు పట్టారని గుర్తు చేశారు. వివాదస్పదమైన యారీ కాలనీలో మెట్రో కార్ షెడ్ను నిర్మించడం మంచిది కాదని చెప్పారు.
నేను చెప్పిందీ ఇదేగా..
అయిదేళ్ల ప్రభుత్వ కాలాన్ని రెండున్నరేళ్ల పాటు పంచుకోవాలంటూ తాను ఎన్నికలు ముగిసిన సమయంలోనే అమిత్ షా వద్ద ప్రతిపాదించానని, అప్పట్లో దాన్ని ఆయన నిర్ద్వంద్వంగా తిరస్కరించారని చెప్పారు. ఇప్పుడు అదే అమిత్ షా- ఏక్నాథ్ షిండేతో కలిసి ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేశారని నిలదీశారు. అప్పట్లో తన ప్రతిపాదనలను ఆయన అంగీకరించి ఉంటే.. మహా వికాస్ అగాఢీ సంకీర్ణ కూటమి ఏర్పాటయ్యేదే కాదని తేల్చి చెప్పారు. ఇప్పుడు సోకాల్డ్ శివ సైనికుడిని బీజేపీ ముఖ్యమంత్రిని చేసిందని ఎద్దేవా చేశారు.