మరికొన్ని గంటల్లో పోలింగ్.. బెంగాల్, అసోంలో.. ఏర్పాట్లు పూర్తి
తొలి దశ ఎన్నికలకు పోలింగ్ శనివారం జరగనుంది. పశ్చిమ బెంగాల్ లోని 30 స్థానాలకు, అసోంలోని 47 స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ బూతులకు సిబ్బంది చేరుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. బెంగాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు గస్తీ నిర్వహిస్తున్నాయి. పటిష్టమైన భద్రత మధ్య ఎన్నికలు జరుగుతాయని అధికారులు తెలిపారు.
ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటిస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్న 30 నియోజకవర్గాల్లో ఎక్కువ సీట్లు నక్సల్స్ ప్రభావిత జంగ్లీమహల్ ప్రాంతంలోనివే కావడం విశేషం. 2016లో ఈ ప్రాంతంలో టీఎంసీ భారీగా సీట్లు కైవసం చేసుకుంది. 30 సీట్లలో మొత్తం 27 టీఎంసీ గెలుచుకోగా... కాంగ్రెస్ రెండు సీట్లు, ఆర్ఎస్పీ ఒక స్థానంలో గెలుపొందింది.
2019 సార్వత్రిక ఎన్నికలలో ఈ ప్రాంతంలో ఎక్కువ పార్లమెంటరీ స్థానాలను బీజేపీ గెలిచింది. దీంతో ఈ ప్రాంతంలో తమకు పైచేయి ఉందని ఆ పార్టీ భావిస్తోంది. అసోంలో మొదటి దశలో సీఎం సర్బానంద సోనోవాల్,స్పీకర్ సహా పలువురు కేబినెట్ మంత్రులు పోటీలో ఉన్నారు.