మోడీపై ప్రశ్న:రాహుల్కు కాలేజ్ గర్ల్స్ ఊహించని షాక్
బెంగళూరు: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి బుధవారం నాడు కర్నాటక రాజధాని బెంగళూరులో విద్యార్థినీలు షాకిచ్చారు! ప్రధాని మోడీ 'క్లీన్ ఇండియా' విజయవంతంగా ముందుకెళ్తుందా అని ఆయన ప్రశ్నించారు. దానికి చాలామంది అమ్మాయిలు.. అవును అంటూ ఝలక్ ఇచ్చారు.
రాహుల్ గాంధీ మౌంట్ కార్మెల్ కాలేజ్ ఫర్ ఉమెన్ కళాశాలలో బుధవారం నాడు అమ్మాయిలతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పైన మండిపడ్డారు. కళాశాలలోని అమ్మాయిలకు కేంద్రం గురించి ప్రశ్నలు వేసి రాబట్టే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ప్రధాని మోడీ లక్ష్యం అయిన 'క్లీన్ ఇండియా విజయవంతమయ్యాయా' అని అడిగారు. కళాశాల విద్యార్థినీలు చాలామంది.. 'అవును' అంటూ రాహుల్ గాంధీకి షాకిచ్చారు. కొద్దిమంది నో అన్నారు. ఆ తర్వాత ఆయన మరోసారి అడగగా.. చాలామంది 'నో' అన్నారు.
నితీష్ కుమార్ మంచి వ్యక్తి కాబట్టి మద్దతిచ్చాం
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంచి వ్యక్తి, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వ్యక్తి అని అందుకే ఆయనకు తాము మద్దతిచ్చామని రాహుల్ గాంధీ చెప్పారు. బతుకు, బతికించు అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమన్నారు. బీహార్ మంత్రివర్గంలో లాలూ ప్రసాద్ ఎలాంటి పదవులు చేపట్టడం లేదన్నారు.
మంత్రి పదవులు చేపట్టిన లాలూ కొడుకులకు, లాలూకు సంబంధం లేదని చెప్పారు. లాలూ కొడుకులు అవినీతిని సహించమని ప్రకటన చేశారని గుర్తు చేశారు. మహారాష్ట్రలో బీజేపీ నేతలు చేసిన అవినీతిని గుర్తించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి సహకరించదన్నారు. దేశాన్ని నడిపిస్తోంది ప్రధాని కార్యాలయం అన్నారు. ప్రధాని మోడీ ఆర్టీఐని నిర్వీర్యం చేస్తున్నారన్నారు.