పెళ్లయిన కొద్దిరోజులకే..: విగతజీవిగా నవ వధువు, ఏం జరిగింది?
కృష్ణరాజపురం: కాళ్ల పారాణి కూడా ఆరకముందే ఓ నవవధువు అనుమానానస్పద రీతిలో మృతి చెందింది. ఈ ఘటన కే.ఆర్.పురం రైల్వేస్టేషన్ పరిధిలోని రైల్వే వసతి సముదాయంలో సోమవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రైల్వేశాఖలో ఉద్యోగం చేస్తున్న నరేశ్ తన స్నేహితురాలైన రమితా(21)ని మార్చిలో వివాహం చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి స్నేహితులైన వీరు.. ఒకే కాలేజీలో చదువుకున్నారు. ఆ క్రమంలోనే స్నేహం కాస్త ప్రేమగా మారింది.
ఆపై పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన కొద్దిరోజులకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇటీవల నరేశ్ తల్లి మృతి చెందడంతో ఆమె దుస్తులు ఖాళీ చేసే విషయమై విభేదాలు వచ్చినట్టు తెలుస్తోంది.
ఇదే విషయంపై గొడవ జరుగుతూ వస్తున్న క్రమంలోనే సోమవారం రమితా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పెళ్లయి నెల రోజులైనా కాకముందే తమ కూతురు మరణించడాన్ని ఆ కుటుంబం తట్టుకోలేకపోతోంది. ఇది ముమ్మాటికి హత్యేనని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
మరో యువతిని వివాహం చేసుకోవడానికి నరేశ్ ప్రయత్నిస్తున్నాడని, అందుకే రమితాను హత్య చేశాడని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై కేఆర్ పురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.