Gujarat Assembly Elections 2022 : రెండుదశల్లో గుజరాత్ ఎన్నికలు-డిసెంబర్ 1, 5 తేదీల్లో పోలింగ్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించింది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ఛీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 18తో గుజరాత్ అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు వీలుగా ఈసీ ఎన్నికల తేదీల్ని ప్రకటించింది.
ఈసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 4.9 కోట్ల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈసారి మరో 3 లక్షల మందికి పైగా కొత్త ఓటర్లు ఓటు హక్కువినియోగించుబోతున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. మొత్తం 182 సీట్లున్న గుజరాత్ అసెంబ్లీలో ప్రస్తుతం బీజేపీ 111 సీట్లతో అధికారంలో ఉంది. విపక్ష కాంగ్రెస్ కు 62 సీట్లు ఉన్నాయి. మిగతా సీట్లలో ఎన్సీపీ సహా చిన్న పార్టీలు ఉన్నాయి. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి కాంగ్రెస్ తో పాటు ఆప్ నుంచి కూడా గట్టి పోటీ ఎదురవుతోంది.
గుజరాత్ అసెంబ్లీకి ఈసారి రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. 33 జిల్లాల్లో విస్తరించిన మొత్తం 182 సీట్లలో రెండు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. తొలిదశ ఎన్నికలకు ఎల్లుండి నోటిఫికేషన్ విడుదల కానుంది. రెండో దశ ఎన్నికల కోసం ఈ నెల 10న నోటిఫికేషన్ ఇస్తారు. తొలిదశ ఎన్నికలు డిసెంబర్ 1న జరగనుండగా.. రెండోదశ ఎన్నికల్ని డిసెంబర్ 5న నిర్వహిస్తారు. డిసెంబర్ 8న ఫలితాలు ప్రకటిస్తారు.
ఇందుకోసం 51 వేలకు పైగా పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇెందులో 50 శాతం పోలింగ్ బూత్ లలో వెబ్ క్యాస్టింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎన్నికల్లో వచ్చే ఫిర్యాదుల నమోదు కోసం సీ-విజిల్ యాప్ లో అవకాశం కల్పిస్తున్నామని రాజీవ్ కుమార్ తెలిపారు. ఫిర్యాదులపై గంటలో పరిష్కార బృందం ఏర్పాటు చేస్తామని, 100 నిమిషాల్లో దాని వాస్తవికత నిర్ధారించి చర్యలు తీసుకుంటామన్నారు.