భారత మిస్సైల్ మిస్ ఫైర్-పాకిస్తాన్ లో పడిన వైనం-విచారణకు కేంద్రం ఆదేశం
భారత్ కు చెందిన ఓ క్షిపణి మిస్ ఫైర్ అయి పాకిస్తాన్ భూభాగంలో పడిన వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. అసలే భారత్-పాకిస్తాన్ మధ్య ఉప్పూనిప్పూగా సాగే వ్యవహారాల్లో ఇప్పుడు ఈ మిసైల్ మిస్ ఫైర్ అంశం కొత్త వివాదం రేపుతోంది. భారత్ చర్యపై పాకిస్తాన్ మండిపడుతుండగా.. కేంద్రం దీనిపై స్పందించింది.
Recommended Video
భారత్ నుంచి మిస్ ఫైర్ అయిన ఓ క్షిపణి పాకిస్తాన్ భూభాగంలో 30 కీలోమీటర్ల దూరంలో పడటంతో స్ధానికంగా ఆస్తినష్టం చోటు చేసుకుంది. మార్చి 9న సాయంత్రం 6:43 గంటలకు భారత్ లోని సూరత్గఢ్ నుంచి పాకిస్తాన్లోకి ప్రవేశించిన ఈ క్షిపణి తమ గగనతలాన్ని ఉల్లంఘించిందని విదేశాంగ కార్యాలయానికి పిలిపించిన భారతీయ దౌత్యవేత్తకు అక్కడి అధికారులు తెలిపారని విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని మియాన్ చున్నూ నగరానికి సమీపంలో సాయంత్రం 6:50 గంటలకు ఇది నేలపై పడింది, దీనివల్ల పౌరుల ఆస్తులకు నష్టం వాటిల్లిందని అధికారులు ప్రకటించారు.
దీనిపై ఆగ్రహంవ్యక్తం చేసిన పాకిస్తాన్ .. ఇస్లామాబాద్ లోని భారత హైకమిషనర్ కు సమన్లు పంపింది. పాకిస్తాన్ ఇవాళ ఇస్లామాబాద్లోని భారతదేశ ఛార్జ్ డి'అఫైర్స్ను పిలిపించింది. భారత్ కు చెందిన "సూపర్-సోనిక్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్" ద్వారా తన గగనతలంలో రెచ్చగొట్టకుండా ఉల్లంఘించిందని ఆరోపించినందుకు తన తీవ్ర నిరసనను తెలియజేసింది . అలాగే ఈ సంఘటనపై సమగ్ర, పారదర్శక దర్యాప్తు కూడా కోరింది.
దీనిపై స్పందించిన కేంద్రం.. సాంకేతిక లోపం కారణంగా రొటీన్ మెయింటెనెన్స్లో ప్రమాదవశాత్తు క్షిపణి పేలడాన్ని భారత్ సీరియస్గా తీసుకుందని అధికారిక ప్రకటనలో తెలిపింది. దీన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో పాటు ఉన్నత స్థాయి కోర్టు విచారణకు ఆదేశించిందని వెల్లడించింది. ఆ క్షిపణి పాకిస్థాన్లోని ఓ ప్రాంతంలో ల్యాండ్ అయిందని ఆ నోట్లో పేర్కొంది. ఈ సంఘటన చాలా విచారకరమని, ప్రమాదం కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించే విషయమని పేర్కొంది.