చాణక్య ఎగ్జిట్ పోల్ అంచనా: పంజాబ్ లో పోటాపోటీ.. ఉత్తరాఖండ్ బీజేపీదే
చాణక్య ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం... పంజాబ్ లో ప్రధానంగా పోటీ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల నడమే ఉంటుంది.. ఇక ఉత్తరాఖండ్ లో బీజేపీ అవలీలగా అధికారం చేజిక్కించుకుంటుంది.
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఒక్క పంజాబ్ లో తప్ప మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. గురువారం సాయంత్రం వెలువడిన ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే... నోట్ల రద్దు అంశం బీజేపీపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపలేదని అర్థమవుతోంది.
పంజాబ్ లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ రెండింటి పరిస్థితి.. నువ్వా? నేనా? అనేలా ఉన్నట్లు చాణక్య ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. ఈ రెండు పార్టీలు ఇక్కడ కాస్త అటూ ఇటుగా 54 సీట్లు గెలుచుకుంటాయని, శిరోమణి అకాలీదళ్-బీజేపీ సంయుక్తంగా 9 సీట్ల వరకు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని చాణక్య ఎగ్జిట్ పోల్ అంచనా.
పంజాబ్ లో మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలే దాదాపు 34 నుంచి 37 శాతం వరకు పంచుకుంటాయని, మిగిలిన ఓట్లలో శిరోమణి అకాలీదళ్-బీజేపీ కూటమి 22 నుంచి 25 శాతం వరకు పంచుకుంటాయని, ఇక 10 నుంచి 13 శాతం ఓట్లు ఇతరులకు వెళ్తాయని చాణక్య ఎగ్జిట్ పోల్ తేల్చింది. ఈ అంచనాలే గనుక నిజమైతే.. పంజాబ్ లో ఈసారి కూడా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడనుంది.
ఉత్తరాఖండ్ లో బీజేపీ హవా
ఉత్తరాఖండ్ లో బీజేపీ పాగా వేయనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. గురువారం సాయంత్రం ప్రకటించిన చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ప్రస్తుతమున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ గెలిచే అవకాశముందని తేలింది.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో పలు జాతీయ ఛానెళ్లు ఇక్కడ బీజేపీ గెలుపునకే మొగ్గు చూపగా.. కాంగ్రెస్ ను రెండో స్థానానికి పరిమితం చేశాయి. చాణక్య సర్వే ప్రకారం 70 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీకి 53, అధికార పక్షమైన కాంగ్రెస్ కు 15, ఇతరులకు 2 సీట్లు రానున్నాయి.
ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తుంటే.. ఉత్తరాఖండ్ లో బీజేపీ అవలీలగా అధికారం చేజిక్కించుకుంటుందని చెప్పొచ్చు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధోగతి పాలవడానికి ప్రధాన కారణం ఆ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలే అని చెప్పాలి. చాలా నియోజకవర్గాలలో రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థుల బెడద లేకుండా చాకచక్యంగా వ్యవహరించడం బీజేపీకి బాగా కలిసొచ్చిన అంశం.