జోధ్పూర్లో ఇరువర్గాల మధ్య ఘర్షణలు, రాళ్ల దాడులు: ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
న్యూఢిల్లీ: రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో సోమవారం రాత్రి నుంచి ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మంగళవారం ఈదుల్ ఫితర్, అక్షయ తృతీయ పండగలు జరుపుకుంటున్న ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో జోధ్పూర్లో ఇంటర్నెట్ సేవలను జిల్లా అధికారులు రద్దు చేశారు.
అల్లర్లు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా, అవాస్త ప్రచారాలను అడ్డుకునేందుకు ఇంటర్నెట్ సేవలను రద్దు చేసినట్లు జోధ్పూర్ డివిజనల్ కమిషనర్ హిమాన్షు గుప్తా తెలిపారు. మంగళవారం తెల్లవారుజాముకు ముందు రాత్రి 1 గంట నుంచి ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు వెల్లడించారు.
2జీ, 3జీ, 4జీ, డేటా మొబైల్ నెట్వర్క్, బల్క్ ఎస్ఎంఎస్, ఎంఎంఎస్, వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా సేవలను కూడా నిలిపివేశారు. వాయిస్ కాల్స్, బ్రాడ్ బ్యాండ్ సేవలను, లీజ్డ్ లైన్స్ కాకుండా మిగితా ఇంటర్నెట్ సేవలను జోధ్పూర్ జిల్లా వ్యాప్తంగా నిలిపివేశామని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని చెప్పారు.
కాగా, ఇరువర్గాల రాళ్ల దాడుల్లో పలువురు గాయాలపాలయ్యారు. జలోరి గేట్ ఇంటరాక్షన్ సర్కిల్ వద్ద బల్ముకోండ బిస్సా వద్ద ఓ ప్రార్థనా స్థలంపై మరో వర్గానికి చెందిన జెండా పెట్టడంతోనే ఈ ఘర్షలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇరువర్గాల మధ్య రాళ్లు, కర్రలతో దాడులు చోటు చేసుకున్నాయి. లౌడ్ స్పీకర్లను అక్కడ్నుంచి తొలగించారు.
ఘర్షణలపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం జోధ్పూర్ జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉందని జోధ్పూర్ పోలీస్ కమిషనర్ నవజ్యోతి గొగోయ్ వెల్లడించారు. ఇరువర్గాల రాళ్ల దాడుల్లో పలువురు పోలీసులు కూడా గాయపడినట్లు సదరు అధికారి తెలిపారు.
ఈ ఘర్షణలు విచారకరమని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.