పీకే చిత్రంపై రాందేవ్ ఆగ్రహం, ఫిర్యాదు చేస్తానని సుబ్రహ్మణ్య స్వామి
న్యూఢిల్లీ: అమీర్ ఖాన్ నటించిన ‘పీకే' చిత్రం పైన సాంఘీక బహిష్కరణ విధించాలని యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు. ఈ చిత్రంలో హిందూ దేవుళ్లను కించపరిచారని, హిందూ సంస్కృతిని తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. ఇతర మతాల గురించి ఎవరైనా మాట్లాడాటానికి వందసార్లు ఆలోచిస్తారని, అదే హిందూ మతం గురించి ఎవరైనా, ఏదైనా మాట్లాడతారని, ఇది సిగ్గు చేటన్నారు. పీకేలాంటి చిత్రాలను జనమే బహిష్కరించాలన్నారు.
పీకే సినిమాపై ఫిర్యాదు
అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రం పైన తాను ఫిర్యాదు చేస్తానని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి మంగళవారం అన్నారు. పీఎంఎల్ఏ కింద తాను అమీర్ ఖాన్, తదితరుల పైన ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
పాఠకుల కోసం ఫేస్బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.
ముంబై థియేటర్లో చిత్రం నిలిపివేత?
ముంబైలో పలువురు విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు థియేటర్ వద్ద ఆందోళన చేపట్టారు. తమ మత గౌరవాలు కించపరిచేలా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు. దీంతో సదరు సినిమా థియేటర్ యజమాన్యం షోను నిలిపివేసినట్లుగా తెలుస్తోంది.
గుజరాత్ రాష్ట్రంలో పలు థియేటర్ల పైన దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో పీకే చిత్రం ప్రదర్శిస్తున్న ఓ థియేటర్ వద్ద మంగళవారం నాడు బంజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. వారు దాడికి పాల్పడటంతో థియేటర్ అద్దాలు పగిలాయి.