కార్యకర్తలా, మజాకా?.. బిర్యానీ కోసం గుద్దుకున్నారు..!
ముజఫర్నగర్ : ఎన్నికల పండుగ వచ్చిందంటే చాలు ఆయా పార్టీల కార్యకర్తలకు సంబురమే. జెండాలు మోస్తూ, నేతలకు జై కొడుతూ సాయంత్రానికల్లా బీరు, బిర్యానీతో ఎంజాయ్ చేయడం కామన్ అయిపోయింది. ఎన్నికల షెడ్యూల్ మొదలు పోలింగ్ తేదీ సాయంత్రం వరకు పోటీలో నిలిచిన అభ్యర్థుల జేబులకు చిల్లులు పడాల్సిందే. అయితే బీరు, బిర్యానీ ఇప్పిస్తే ఓ బాధ, లేకుంటే మరో బాధ అన్నట్లు తయారవుతోంది నేతల పరిస్థితి.
తాజాగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఘటన చర్చానీయాంశంగా మారింది. ముజఫర్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి నసీముద్దీన్ సిద్దిఖీ ఎన్నికల సమావేశం నిర్వహించారు. మీటింగ్ అయిపోయాక.. వచ్చినవారి కోసం బిర్యానీ ఆరేంజ్ చేశారు. అయితే బిర్యానీ కోసం కార్యకర్తలు ఎగబడటంతో తోపులాట జరిగింది. ఆ క్రమంలో వాదులాటకు దిగడమే గాకుండా తన్నుకున్నారు. బిర్యానీ పెట్టడం ఏమోగానీ ఆ మీటింగ్ మాత్రం రచ్చరచ్చయింది. రణరంగంలా మారడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అసలు ఈ సమావేశానికి పర్మిషన్ తీసుకోలేదని కేసు నమోదు చేశారు.
జనం లేరని ఫోటో తీశాడు..! జర్నలిస్టును చితకబాదిన కాంగ్రెసోళ్లు (వీడియో)
బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జమీల్ నివాసంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. సమావేశం ముగియగానే అందరూ భోజనం చేసి వెళ్లాలంటూ నేతలు కోరారు. దాంతో డైనింగ్ సెక్షన్ కు వెళ్లిన కార్యకర్తలు బిర్యానీ కోసం ఎగబడ్డారు. ఆ క్రమంలో ఘర్షణ మొదలై పిడిగుద్దులకు దారితీసింది. ఒకరినొకరు ఇష్టమొచ్చినట్లుగా కొట్టుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు. దీనంతటికీ కారణమంటూ జమీల్ సహా మొత్తం 34 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అతిక్రమించారనే అభియోగంతో కేసు ఫైల్ చేశారు పోలీసులు.