చరిత్ర సృష్టించేందుకు ఇస్రో సిద్ధం: నేడే 104 ఉపగ్రహాలు నింగిలోకి(పిక్చర్స్)
ఒకేసారి 104 ఉపగ్రహాలను రోదశిలోకి ప్రవేశపెట్టడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు.
శ్రీహరికోట: అంతరిక్ష ప్రయోగాల్లో మరో చరిత్ర సృష్టించేందుకు ఇస్రో సిద్ధమైంది. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని ప్రయోగానికి నాంది పలికింది. ఒకేసారి 104 ఉపగ్రహాలను రోదశిలోకి ప్రవేశపెట్టడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. మన దేశానికి చెందిన మూడు ఉపగ్రహాలతో పాటు విదేశాలకు చెందిన 101 ఉపగ్రహాలను ఒకే వాహక నౌక ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు.
9.28కు మొదటి ప్రయోగం
ప్రయోగాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఇస్రో ఛైర్మన్ కిరణ్కుమార్ ఇప్పటికే నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్(షార్)కు చేరుకున్నారు. బుధవారం ఉదయం 9.28 గంటలకు మొదటి ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సి37 నింగిలోకి ఎగరనుంది.
ఒకేసారి 104 ఉపగ్రహాలు
మొత్తం 524 కి.మీలు ప్రయాణించిన తర్వాత సూర్యావర్తన కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టనున్నారు. మొత్తం 104 ఉపగ్రహాల్లో అమెరికాకు చెందిన 96 ఉపగ్రహాలు ఉన్నాయి.
విదేశాలకు చెందినవే ఎక్కువ..
ఇందులో డవు ఉపగ్రహాలు 88, లెమర్ ఉపగ్రహాలు 8, ఇజ్రాయిల్, కజకిస్థాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన ఒక్కొక్క ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ కక్ష్యలోకి మోసుకెళ్లనుంది.
తుది పరీక్ష పూర్తి..
శ్రీహరికోట షార్లోని మొదటి ప్రయోగ వేదికలో పీఎస్ఎల్వీ-సి37 వాహక నౌకకు శాస్త్రవేత్తలు తుది పరీక్షలు పూర్తి చేశారు.మన దేశానికి చెందిన మూడు ఉపగ్రహాల్లో కార్టోశాట్-2 714 కిలోలు, ఐఎన్ఎస్ 1ఎ, ఐఎన్ఎస్ 1బి ఉపగ్రహాలు ఒక్కొక్కటి 15 కిలోల బరువు ఉన్నాయి.
నిర్దేశిత కక్ష్యలోకి..
మిగిలిన దేశాలకు చెందిన ఉపగ్రహాల బరువు 834 కిలోలు. అమెరికాకు చెందిన నానో శాటిలైట్లు.. భూగోళ పరిశోధన ప్లానెట్ అనే సంస్థ అంతరిక్షంలోకి పంపుతుంది. ఇవి భూ సంబంధ పరిశోధనలు చేస్తాయి. పీఎస్ఎల్వీ-సి37 వాహక నౌక 28.42 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యలోకి చేరనుంది.
వాహకనౌక సిద్ధం..
ప్రయోగం ప్రారంభమైన తర్వాత 17.29 నిమిషాలకు కార్టోశాట్-2 రాకెట్ నుంచి 510.383 కి.మీల ఎత్తులో విడిపోనుంది. ఐఎన్ఎస్-1ఎ 17.39 నిమిషాలకు, ఐఎన్ఎస్-2బి 17.40 నిమిసాలకు వాహక నౌక నుంచి విడిపోనున్నాయి. దీని తర్వాత 18.32 నిమిషాల నుంచి 28.42 నిమిషాల మధ్య విదేశీ ఉపగ్రహాలన్నీ 524 కి.మీల ఎత్తులో వాహక నౌక నుంచి విడిపోయే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు వాహక నౌకను సిద్ధం చేశారు.
తిరుమలలో శాస్త్రవేత్తల పూజలు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని ఇస్రో శాస్త్రవేత్తలు మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఇస్రో డైరెక్టర్లు ఆచార్య ఎ.జయరామన్, డాక్టర్ అరుణన్, డాక్టర్ కనుంగో, డాక్టర్ జగదీష్, పీఆర్వో శ్రీనివాస గుప్తా పాల్గొన్నారు. శ్రీహరికోట నుంచి బుధవారం ప్రయోగించనున్న వాహక నౌక నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ప్రతి ప్రయోగం ముందు ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారిని దర్శించుకోవడం, నమూనాను శ్రీవారి ముందు ఉంచడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.